హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా గురువారం పిలుపునిచ్చారు. గతేడాది కేటీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ నేతలు 100 అంబులెన్స్లను విరాళంగా అందజేశారు. తన పుట్టిన రోజున పూల బొకేలు, కేకులు, కటౌట్ల కోసం డబ్బులు వృథా చేయకుండా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని ఒక మొక్క నాటాలని మరో ట్వీట్లో మంత్రి కేటీఆర్ తన అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులను కోరారు. శనివారం మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు.
భారీ స్పందన
మంత్రి కేటీఆర్ పిలుపునకు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి భారీ స్పందన వస్తున్నది. గిఫ్ట్ ఏ స్మైల్ కింద తాను 50 త్రిచక్ర వాహనాలను అందిస్తానని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రకటించారు. ‘నా ఆదర్శ నాయకుడు కేటీఆర్ అన్న అడుగుజాడల్లో నడుస్తా’ అని పేర్కొన్నారు. తాను కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్ 50, గాదరి కిశోర్కుమార్ 20, గువ్వల బాలరాజు 20, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి 60, శంభీపూర్ రాజు 60, నవీన్కుమార్ 100 త్రిచక్రవాహనాలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జీవన్రెడ్డి, సైదిరెడ్డి తాము సైతం గిఫ్ట్ ఏ స్మైల్లో పాల్గొంటామని ట్వీట్లు చేశారు. వందలమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగస్వాములం అవుతామని ట్వీట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు త్రిచక్రవాహనాలు అందించాలన్న మంత్రి కేటీఆర్ నిర్ణయంపై రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. దివ్యాంగులు కేటీఆర్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా రూ. 24 కోట్లతో అర్హులైన 17వేల మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశామని గుర్తుచేశారు.
ప్రాణాలు నిలుపుతున్న అంబులెన్సులు
మంత్రి కేటీఆర్ గతేడాది తన పుట్టిన రోజున ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్లో వివిధ నేతలు విరాళంగా ఇచ్చిన 100 అంబులెన్స్లు ప్రజల విలువైన ప్రాణాలను కాపాడుతున్నాయి. ఆయన సొంత ఖర్చుతో కొనుగోలుచేసిన ఆరు అంబులెన్స్లను 2020, జూలై 30న ప్రగతి భవన్లో జెండా ఊపి ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖలో 424 అంబులెన్స్లుండగా, వాటికి అదనం గా ఈ 100 అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. ఈ అంబులెన్స్లలో అత్యాధునిక అత్యవసర వైద్య పరికరాలు ఏర్పాటుచేశా రు. వీటిలో ఒకేసారి ఇద్దరు రోగులను దవాఖానకు తరలించవచ్చు. ఆక్సిజన్తోపాటు, పురుగుల మందు తాగినవారికి చికిత్స అందించేందుకు వ్యాక్యూం మిషన్ ఇందులో ఉంటుంది.
జై కేటీఆర్ పాట ఆవిష్కరణ
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో రూపొందించిన ‘జై కేటీఆర్’ పాటను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. ‘జై కేటీఆర్.. జైజై కేటీఆర్..’ అంటూ సాగే పాట మంత్రి కేటీఆర్ మానవీయకోణానికి అద్దంపట్టిందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవ, టీఆర్ఎస్ నాయకులు జోగు మహేందర్, కిశోర్గౌడ్, పాట రచయిత మానుకోట ప్రసాద్, డైరెక్టర్ పూర్ణచందర్, నిర్మాత కొణతం లక్ష్మణ్, ప్రణయ్, సంగీత దర్శకుడు బాజీ, వెంకీ పాల్గొన్నారు.