జెరూసలేం: అల్లంత దూరం నుంచి నిప్పులు విరజిమ్ముతూ దూసుకొస్తున్న వందలాది రాకెట్లు ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోతున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల్లో కనిపించిన ఈ దృశ్యాలు దేశవిదేశాల ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాయి. అదృశ్య శక్తేదో ఇజ్రాయెల్ను రక్షిస్తున్నదని వాళ్లు భ్రాంతి పడ్డారంటే అతిశయోక్తి కాదు. అయితే, గాజాలోని హమాస్ ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టడానికి అత్యాధునిక శాస్త్ర-సాంకేతికతను తన అమ్ములపొది నుంచి బయటకు తీసింది ఇజ్రాయెల్. సైనికుడికి కవచంలా, రాజ్యానికి కోటలా ప్రస్తుతం ఇజ్రాయెల్కు అదృశ్య రక్షణ కవచంలా ఉన్నదే ‘ఐరన్డోవ్ు’ ఎయిర్ డిఫెన్స్ సిస్టవ్ు.
ఏమిటీ ఐరన్ డోవ్ు?
శత్రువులు ప్రయోగించే చిన్న శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లు(సీ-రామ్), విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ముందుగానే పసిగట్టి వాటిని గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ‘ఐరన్ డోమ్’.
ఎలా పనిచేస్తుంది..?
ఐరన్ డోవ్ులో మూడు వ్యవస్థలు ఉంటాయి. రాడార్, బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ సిస్టమ్ (బీఎంసీ), మిసైల్ ఫైరింగ్ యునిట్. శత్రువులు ప్రయోగంచే రాకెట్లను రాడార్ పసిగట్టి.. దాని గమనాన్ని బీఎంసీకి పంపిస్తుంది. రాకెట్ వేగం, పడే ప్రాంతాలను అంచనావేసి మిసైల్ ఫైరింగ్ యునిట్కు బీఎంసీ ఆదేశాలు ఇస్తుంది. అనంతరం ఐరన్ డోవ్ు నుంచి వెలువడిన టమిర్ క్షిపణులు ప్రత్యర్థుల రాకెట్ను గాల్లోనే పేల్చివేస్తుంది.
అప్పుడు దెబ్బ పడిందని..
2006లో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్కు చెందిన హెజ్బొల్లా ఉగ్రవాదులు వేలాది రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించారు. ఫలితంగా ఇజ్రాయెల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీంతో శత్రుదేశాలు ప్రయోగించే రాకెట్ వంటి ఆయుధాలను గాల్లోనే ధ్వంసం చేసేలా ఏదైనా రక్షణ వ్యవస్థ ఉండాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. మరుసటి ఏడాదే స్వదేశీ సంస్థ రాఫెల్ అడ్వాన్స్ సిస్టవ్ సహకారంతో ఈ డోమ్ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. అలా 2011లో దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ 80 శాతం వరకు ఉన్నట్టు నిపుణులు తెలిపారు.
ఖర్చు తడిసి మోపెడు.. అయితే
గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇప్పటివరకూ ఇజ్రాయెల్పై 1,200 వరకు రాకెట్లను ప్రయోగించారు. ఒక్కో రాకెట్ ఖరీదు వెయ్యి డాలర్లు (రూ.73,559). అంటే మొత్తం ఖర్చు రూ. 8.82 కోట్లు. వీటిలో 200 రాకెట్లను ఇజ్రాయెల్ డోమ్ ధ్వంసం చేసింది. దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ప్రజల ప్రాణాల కంటే ఈ మొత్తం చాలా తక్కువ అని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. కాగా శత్రు క్షిపణులను, రాకెట్లను ధ్వంసం చేయడానికి ఇప్పటికే భారత్లో శక్తిమంతమైన రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.