‘నిశిరాత్రి వేళ.. ప్రపంచమంతా నిద్రించే సమయంలో.. భారతదేశం మాత్రం జీవితానికీ, స్వేచ్ఛకూ స్వాగతం చెబుతున్నది’ అంటూ చట్టసభ సాక్షిగా నెహ్రూ పలికిన మాటల్ని ఎవరు మర్చిపోగలరు. స్వాతంత్య్రం వచ్చిన సందర్భం అది. దేశం మొత్తం మువ్వన్నెలతో మెరిసిన సందడి అది. అందరిలోనూ ఉద్విగ్నత. బానిస సంకెళ్లను తెంచుకున్న సంతోషం. తరాలుగా పరాయిపాలనలో మగ్గినవాళ్లను అడిగితే చెబుతారు.. స్వేచ్ఛ విలువ ఏపాటిదో! అందుకేనేమో నెహ్రూ తన ఉపన్యాసంలో జీవితాన్నీ, స్వేచ్ఛనూ కలిపే గుర్తుచేసుకున్నారు. కానీ, అది ఆరంభం మాత్రమే. స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవాలంటే సరైన నాయకత్వం ఉండాలి. అదే అసలైన సవాలు! రాజులకో, సామంతులకో మళ్లీ అధికారం ఇవ్వడం అంటే శతాబ్దాలుగా ఎదురుచూసిన స్వేచ్ఛకు తిలోదకాలు ఇవ్వడమే. దేశంలో ఏ పౌరుడైనా నాయకుడయ్యే అవకాశం కల్పించాలి. అందుకనే.. ఓ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకొని, దాన్ని గణతంత్రానికి వేదంగా భావించి ప్రజాస్వామ్య యజ్ఞం ప్రారంభించారు. మన స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అండగా నిలిచిన ప్రజాస్వామ్యాన్ని తల్చుకునేందుకు ఇంతకు మించిన సందర్భం ఏం ఉంటుంది?
‘డెమోక్రసీ’ అన్న పేరు మనది కాకపోవచ్చు. పార్లమెంటు వ్యవస్థ మరో దేశానిది కావచ్చు. కానీ, ప్రజాస్వామ్యం మనకు కొత్త కాదు. 2,600 సంవత్సరాల క్రితమే అఖండ భారతంలో ప్రజాస్వామ్య పంథాలో నడిచిన రాజ్యాలు అనేకం ఉన్నాయని చరిత్ర పేర్కొంటున్నది. బహుశా, అది మన రక్తంలోనే ఉందేమో! అందుకే తొలి ఎన్నికలు జరిగి 70 ఏండ్లు గడుస్తున్నా.. జనాభా వంద కోట్లు దాటినా మన ఓట్ల బండి గాడి తప్పలేదు. ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనీ, ప్రలోభాలు పని చేస్తున్నాయనీ వాదనలు ఉన్నా.. ఓటరు తీర్పు చాలాసార్లు విచక్షణా
యుతంగానే కనిపిస్తుంది. పాలనలో అజాగ్రత్తగా ఉంటే, పోలింగ్లో వాత పెడుతుంది. సేవ చేయాలనే తపన ఉంటే, సామాన్యుడిని సైతం గద్దె మీద కూర్చోబెడుతుంది. ఈ విశిష్టతను నిరూపించేందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు.
ఒకే ఒక్క ఓటు!
చలిచీమలు కలిస్తేనే పాము మట్టికరుస్తుంది. ఒక్కో ఓటు కూడగడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. చాలా సందర్భాల్లో ఒకటి, రెండు శాతం ఓట్ల తేడాతోనే ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. 1999లో అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. పదమూడు నెలల పాలన తర్వాత, మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. ఇక క్షేత్రస్థాయిలో ఓట్ల దన్ను గురించి చెప్పేదేముంది. వంద, వెయ్యి ఓట్లతో తలరాతలు మారిన అభ్యర్థులు ప్రతి ఎన్నికలలోనూ కనిపిస్తారు. వాటిలో కొన్ని ‘వెంట్రుకవాసి’ సందర్భాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
2004 నాటి మాట. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, కాంగ్రెస్, జనతాదళ్ అధికారం కోసం సిగపట్లు పడుతున్నాయి. ఈ త్రిముఖ పోరులో ప్రతి సీటూ కీలకమే. అలాంటి నేపథ్యంలో సంతెమారహళ్లి నియోజకవర్గంలో జనతాదళ్ అభ్యర్థి కృష్ణమూర్తి 40,751 ఓట్లు సాధించారు. గెలుపు ఖాయం అనుకునే తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ
నారాయణ్ ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో సీటు కైవసం చేసుకున్నారు. ఓటు వేసేందుకని ఆయన వ్యక్తిగత డ్రైవర్ సెలవు అడిగితే, కృష్ణమూర్తి మంజూరు చేయలేదంట. ఆ ఒక్క ఓటే ఆ నాయకుడిపై వేటేసింది.
అది 2008వ సంవత్సరం. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సి.పి.జోషి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దూకుడు మీదున్న భాజపాను అడ్డుకునేందుకు పోరాడుతున్నారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గెలిచింది. కానీ, జోషి మాత్రం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. జోషి కనుక గెలిచి ఉంటే చరిత్ర వేరేగా ఉండేది! విచిత్రం ఏమిటంటే ఈ ఎన్నికలలో ఆయన తల్లి, సోదరి కూడా ఓటు వేయలేదట. సింగిల్ ఓటు మహిమ వాళ్లకు తెలిసినట్టు లేదు! లక్షల ఓట్లు కురిసే లోక్సభ ఎన్నికలలో కూడా తక్కువ మార్జిన్లకు కొదువ లేదు. 1962 నుంచి ఇప్పటివరకు వంద ఓట్ల లోపు తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎనిమిదిసార్లు కనిపిస్తాయి. బద్ధకం వదిలించుకుని ముందుకొచ్చే బాధ్యత కలిగిన చైతన్యానికో, పోలింగ్ రోజును సెలవుగా భావించే బద్ధకిస్టుల నిర్లక్ష్యానికో ప్రతీకగా నిలుస్తాయి.
ఏకైక ఓటరు!
ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారులకు సూచించే నియమావళిలో ఓ ఆశ్చర్యకరమైన నిబంధన ఉంది. అదేమిటంటే.. ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది. అందుకనే ఒక్క ఓటరు ఉన్నా ఆ ఏక్ నిరంజన్ కోసం యంత్రాంగమంతా కదలాల్సిందే! అరుణాచల్ ప్రదేశ్లోని మలోగామ్ అనే మారుమూల ప్రాంతంలో ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. అతడిని చేరుకునేందుకు, అయిదుగురు పోలింగ్ అధికారులు చేయని సాహసమంటూ లేదు. నాలుగురోజుల పాటు 300 మైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. దారిలో ఎక్కడైనా ఓ గ్రామం కనిపించినా తలదాచుకునే పరిస్థితి లేదు. కరెంటు కానీ, సెల్ఫోన్ సిగ్నల్స్ కానీ పలకరించవు. సముద్రమట్టం నుంచి వేల అడుగుల ఎత్తున.. దట్టమైన అడవులను దాటుకుంటూ, క్రూర మృగాలను గమనించుకుంటూ ఎన్నికల రోజు తెల్లారేసరికి, వాళ్లు ఎలాగోలా మలోగామ్ చేరుకున్నారు. గుజరాత్లోనూ ఇలాంటి సందర్భమే ఎదురైంది. అక్కడి దట్టమైన గిర్ అడవుల నడుమ ‘బంగంగేశ్వర్ మహదేవ్’ ఆలయం ఉంది. దాని పూజారి భరత్దాస్. ఆ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరం వరకూ ఓటు వేసే సౌలభ్యం లేకపోవడంతో, ప్రభుత్వం ఆయన కోసం పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసింది. ఈ ఒక్క ఓటరు హక్కు కోసం అయిదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహించారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ గమనించిన వాషింగ్టన్ పోస్టు ప్రత్యేక కథనాన్నే ప్రచురించింది. పోలింగ్ అధికారుల మీద ప్రశంసలు కురిపించింది ‘ఓటర్ల కోసం వాళ్లు దట్టమైన అడవులను ఛేదిస్తారు, ఆక్సిజన్ సిలండర్లు పెట్టుకుని హిమాలయాలు ఎక్కుతారు, మొసళ్ల జలపాతాలను దాటి గమ్యాన్ని చేరుకుంటారు. అందరికీ ఓటుహక్కు అందాలన్న నిబద్ధతను ప్రతిఫలించే సందర్భాలివి’ అని అబ్బురపడింది. నిజమే, ఎన్నికల నిర్వహణలో మన తర్వాతే ఎవరైనా. మేరా భారత్ మహాన్.
బహిరంగ యుద్ధం!
దేశ పౌరసత్వం, ఓటు హక్కు, 25 ఏండ్ల వయసు.. ఇలాంటి మౌలికమైన అర్హతలు ఉంటే చాలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అందుకనే కొంతమంది హక్కును చాటుకునేందుకో, ఒక సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకో లేదా తమ ప్రత్యేకతను చాటుకునేందుకో.. ప్రతి ఎన్నికల్లో పాల్గొంటూ ఉంటారు.
మహారాష్ట్రలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 73 ఏండ్ల కొండేకర్ పోటీ చేస్తారు. ‘బూటు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. నేను ప్రధానమంత్రిని అయితే మీ అందరికీ సంపదను పంచుతాను’ అనే బ్యానర్ కట్టిన నాలుగు చక్రాల బండిని తోసుకుంటూ పుణె వీధుల్లో తిరుగుతుంటారు. కొండేకర్ 24 సార్లు ఎన్నికలలో పోటీ చేసి, అన్నిసార్లూ ఓడిపోయారు. ఉత్తరాదికి చెందిన 94 ఏండ్ల నాగేందర్ బజోరియా సమాజ సేవకుడు. బావులు తవ్వించడం, పేదపిల్లలకు చదువు చెప్పించడం.. లాంటి మంచి పనులు చేస్తుంటారు. తన సేవకు కాస్త అధికారం జోడించేందుకు ఆయన ప్రతి ఎన్నికలలో ప్రయత్నిస్తుంటారు. ఇందిర, రాజీవ్, వాజపేయి, అడ్వాణీ.. మహామహులను ఢీకొన్నాడు. మడమతిప్పని స్వభావం ఆయనది.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన లాల్ బిహారీది మరో కథ. తను బతికుండగానే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. పైగా ఆ తప్పును సవరించేందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో లాల్ బిహారీ తన ‘ఉనికి’ని నిరూపించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే 1989లో రాజీవ్ గాంధీ మీద పోటీ చేశారు. ఆ దెబ్బతో లాల్ బిహారీ లాంటి వాళ్ల సమస్య దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
సేలంకు చెందిన పద్మరాజన్ది మరో కథ.
‘ఎన్నికలలో పోటీ చేయడం పౌరుల హక్కు’ అన్న విషయాన్ని ప్రచారం చేసేందుకే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. డిపాజిట్లు కోల్పోయి లక్షల రూపాయల నష్టం వచ్చినా, ఎక్కువసార్లు ఓటమి పాలైన వ్యక్తిగా రికార్డులు వెక్కిరించినా.. తన ప్రయత్నం మానుకోవడం లేదు. ‘ఎన్నికలు కూడా క్రీడల్లాంటివే. పాల్గొనడమే ముఖ్యం, గెలుపు ప్రధానం కాదు’ అంటారామె.
ప్రస్తుతం 90 కోట్లకు పైగా భారతీయులకు ఓటు హక్కు ఉంది. యూరప్ జనాభాకంటే ఇది ఎక్కువ.
నోటా కోటా!
ఎన్నికల్లో నిలబడినంత మాత్రాన ఎవరో ఒకరిని ఎన్నుకుని తీరాలనే నిబంధన మన స్వేచ్ఛకు విఘాతమే. అందుకనే, ఒకప్పుడు నెగెటివ్ ఓట్ అనే వెసులుబాటు ఉండేది. కానీ, ఆ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటమే కాకుండా, ఓటును తిరస్కరించిన వ్యక్తి వివరాలు కూడా వెల్లడయ్యేవి. కానీ, 2013లో అమలులోకి వచ్చిన నోటాతో (none of the above) ఓటు బదులు వేటు వేసే అవకాశం వచ్చింది. నాటి నుంచి నోటాకు ఆదరణ పెరుగుతూనే వస్తున్నది. 2019 జాతీయ ఎన్నికల్లో నోటాకు 1 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. చాలా చోట్ల ఇది గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేసింది. నిరసనలకు వేదికగా మారింది. 2014 జాతీయ ఎన్నికలలో 2జి స్కామ్ నిందితుడు ఎ.రాజా దారుణంగా ఓడిపోయారు. ఆయన నియోజకవర్గంలో నోటా ఓట్లకు మూడో స్థానం దక్కింది. దీని బట్టి జనం అభీష్టం స్పష్టమవుతున్నది. అవినీతి, ప్రలోభాలు ఎక్కువయ్యే కొద్దీ నోటాతో షాక్ ఇవ్వడానికి జనం సిద్ధంగా ఉంటారు.
స్వీపర్ అవుతారు..లీడర్!
దేశంలో ఎవరికైనా సరే నాయకత్వ అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యానికి గీటురాయి. అందుకే పోటీచేసేందుకు ఆస్తులు, డిగ్రీలు అడ్డురావు. అందుకనే మన ఎన్నికలలో అనూహ్యమైన విజయాలు కనిపిస్తాయి. ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ ఓ బంగ్లా బయట పాలు పితికే పనిలో ఉండేవారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చదువుకునే రోజుల్లో మ్యాజిక్ షోస్ చేసేవారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓ చిన్న క్లర్కుగా కెరీర్ ఆరంభించారు. కాస్త గమనించాలే కానీ, ఇంతకంటే సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా కనిపిస్తారు. కాంగ్రెస్ కురువృద్ధుడు భజన్లాల్ కొన్నాళ్లు సైకిల్ మీద దుప్పట్లు అమ్ముతూ జీవనం సాగించారట. అక్కడి నుంచి మూడుసార్లు హరియాణాకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే స్థాయికి చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రిగా విప్లవాత్మక మార్పులు తెచ్చిన వి.ఎస్.అచ్యుతానందన్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో, అర్ధంతరంగా చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పొట్ట నింపుకోవడానికి చిన్న చిన్న వృత్తులు ఎన్నో చేశారు. వ్యవసాయ కూలీల నాయకునిగా ఎదిగి.. అనూహ్యమైన విజయాలు సాధించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బీహార్కు చెందిన భగీరథి దేవిది అనూహ్యమైన ఉదాహరణ. పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్నగర్లో తను పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసేది. 800 రూపాయల నామమాత్రపు జీతం. 2010లో తను రామ్నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించింది. ఆ గెలుపు కేవలం గాలివాటమే అనుకున్నారంతా! కానీ అంగన్వాడీలు, మహిళా సంఘాలు, గృహహింస, కనీస వేతనాలు.. ఇలా ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. మూడుసార్లు వరుసగా ఎన్నికయింది ఆమె. సినిమాల్లో మాత్రమే సాధ్యం అనిపించే ఇలాంటి విజయాలు మన ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంటాయి, ప్రజాస్వామ్యపు సత్తాను నిరూపిస్తుంటాయి.
అందరూ ఒక్కటే!
మహా నాయకుడన్న పేరు అక్కరకు రాదు, పేరుప్రతిష్ఠలు చెల్లవు, అనుభవం సాయపడదు.. ఓటరు తీర్పు ముందు అంతా సమానమే! అందుకు సాక్ష్యాలు కోకొల్లలు. ఓటరన్న అనుకుంటే ఏమైనా చేస్తాడు. నెత్తిన కిరీటం పెట్టగలడు, నెత్తిమీద కాలుపెట్టి పాతాళానికీ తొక్కగలడు.
ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ స్టేషన్.. హిమాచల్ ప్రదేశ్లోని తాషిగంగ్.
ఏకంగా 15,256 అడుగుల ఎత్తు ఉన్న ఈ ప్రదేశంలో 49 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ప్రత్యేకత కారణంగానేచుట్టుపక్కల పోలింగ్ అధికారులు కూడా తమ ఓటు హక్కును ఇక్కడే ఉపయోగించుకుంటారు.
ఓటును మించిన సమవర్తి కనిపించదు. 2019 నాటి చేవెళ్ల నియోజకవర్గమే అందుకు సాక్ష్యం. రూ.895 కోట్ల ఆస్తులున్న కె.వి.రెడ్డితో పాటు, తన ఆస్తుల విలువ 500 రూపాయలే అని ప్రకటించిన ప్రేమ్ కుమార్కూడా బరిలో దిగారు.
గత లోక్సభ ఎన్నికలలో 50 లక్షలకు పైగా అధికారులు, రక్షణదళాలు విధులు నిర్వర్తించినట్టు అంచనా! రోడ్లు, రైళ్లు, పడవలు, హెలికాఫ్టర్లు.. ఆఖరికి ఏనుగుల మీద కూడా ప్రయాణించి లక్ష్యాన్ని అందుకున్నారు.
షరతులకు లోబడి జాతీయ ఎన్నికలకు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయవచ్చు. అలా వాజ్పేయి నాలుగు రాష్ర్టాల (దిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్) నుంచి ఎన్నికయ్యారు కూడా!
పార్టీల ప్రాబల్యం పెరిగినా, స్వత్ంరత్ర అభ్యర్థులు ఎన్నికవుతూనే ఉన్నారు.ప్రస్తుత లోక్సభలో నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా ఏ పార్టీ అండా లేకుండానే నిలిచి గెలిచారు. వారిలో ఇద్దరు తెలుగువారికి పరిచయమైన నటీమణులు.. సుమలత, నవనీత్ కౌర్.
జనహితాన్ని ఆకాంక్షించే ఏ సిద్ధాంతానికైనా ప్రజాస్వామ్యంలో చోటు ఉంది. అందుకే కమ్యూనిజం అంటే సాయుధ పోరాటమే అనుకునే రోజుల్లోనే.. కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రపంచంలోనే తొలి ప్రజాస్వామ్య కమ్యూనిస్టు ప్రభుత్వమది.
యోధుడిని ఓడించిన సుభద్ర జోషి : చాలామందికి తెలియని పేరు ఇది. గాంధీ బోధనలతో ప్రభావితం అయిన స్వాతంత్య్ర యోధురాలు సుభద్ర. కొన్నాళ్లు వార్దా ఆశ్రమంలో గడిపారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. దేశ విభజన సమయంలో అల్లర్లు జరిగినప్పుడు, శాంతిదళం పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి, పరమత సహనానికి పాటు పడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో అడుగుపెట్టి ఎన్నో కీలక నిర్ణయాలకు అండగా నిలబడ్డారు. అయితే వాజపేయి చరిష్మాతో పోలిస్తే ఆమె అనుచరగణం తక్కువే. 1960 నాటికి, జనసంఘ్ యువనాయకుడిగా వాజపేయిది అసాధారణమైన ఆకర్షణ. కానీ, 1962లో బలరామ్పూర్ (ఉత్తర్ ప్రదేశ్)లో
ఆయనకు భంగపాటు కలిగింది. ఆ లోక్సభ ఎన్నికలలో సుభద్ర చేతిలో ఓడిపోయారు వాజపేయి. ఆ తర్వాత పదిసార్లు లోక్సభకు ఎన్నికైనా.. ఆయన జీవితంలో బలరామ్పూర్ ఓటమి ఓ చేదుజ్ఞాపకంగానే మిగిలిపోయింది.
చరిత్రే మారింది : అది 1971వ సంవత్సరం. కాంగ్రెస్కు ఎదురులేని గాలి. ఇందిరకు తిరుగులేని తీరు. ఆ ఏడాది లోక్సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ రాయ్బరేలీ (ఉత్తర్ప్రదేశ్) నుంచి గెలిచారు. ఆమెకు వ్యతిరేకంగా నిలబడినవాడు రాజ్నారాయణ్. రాజవంశానికి చెందిన రాజ్నారాయణ్ ఓ స్వాతంత్య్ర యోధుడు. ఆ పోరులో ఆయన 58 సార్లు జైలుకు వెళ్లాడని చెబుతారు. అయితే ఇందిరను ఢీకొనేంత పెద్ద నాయకుడు కాదు. పైగా ‘సంయుక్త సోషలిస్ట్ పార్టీ’ అనే చీలిక పార్టీ తరఫున నిలబడ్డారు. ఊహించినట్టుగానే ఓడిపోయారు. కానీ, ఆ ఎన్నికలలో ఇందిర అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ కేసు వేశారు రాజ్నారాయణ్. 1975లో అనూహ్యమైన తీర్పు వచ్చింది. అవకతవకలు నిజమేనని పేర్కొంటూ ఫలితాలను రద్దు చేయడంతోపాటు, ఇందిరను తదుపరి ఎన్నికలకు అనర్హురాలిగా పేర్కొంది కోర్టు. ఇది ఎమర్జెన్సీకి దారి తీసింది. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేశాక అదే రాయ్బరేలీ ఎన్నికలలో మళ్లీ ఇందిరతో తలపడ్డారు రాజ్నారాయణ్. 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ లాంటి నాయకులతో కలిసి జనతా ప్రభుత్వం ఏర్పడేందుకు సాయపడ్డారు. చిన్నపాటి విభేదాల వల్ల ఇదే రాజ్నారాయణ్, తన ప్రభుత్వాన్నే కూలదోయడం మరో విశేషం. మొత్తానికి ఓ వ్యక్తి గెలుపు ఓటములు దేశ చరిత్రనే ఎలా ప్రభావితం చేస్తాయని చెప్పేందుకు కూడా రాజ్ ఉదంతమే సాక్ష్యం! వీళ్లే కాదు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ కుర్షీద్, రాజ్బబ్బర్ లాంటి ఉద్ధండులెందరో అనూహ్య రీతిలో డిపాజిట్లు కోల్పోవడం ఓటు బలాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్య సత్తాను చాటుతుంది.
వివక్ష లేని వేళ!
స్వాతంత్య్రం రాకముందే మన దేశంలో ఎన్నికలు మొదలయ్యాయి. కాకపోతే సంపన్నులు, వ్యాపారవేత్తలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. క్రమంగా విద్యావంతులకు కూడా అవకాశం వచ్చింది. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, చెరగని సిరా ఉపయోగించి నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం మొదలైంది. కానీ, ఓటు వేసే వయసు 21 ఏండ్లుగా ఉండేది. 1989లో జరిగిన సవరణతో ఈ పరిమితిని 18 ఏండ్లకు తగ్గించారు. అయితే ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష మాత్రం కొనసాగింది. వాళ్లు ఓటు వేయాలంటే స్త్రీ లేదా పురుషుడుగా నమోదు చేసుకోవాల్సి వచ్చేది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. 2019 నుంచి తమ సహజమైన ఉనికితోనే ఓటు వేయగలిగారు. అప్పటి ఎన్నికలలో ఒక్క దిల్లీలోనే 660 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎన్నికల్లో కనిపించే ప్రభావాల సంగతి పక్కన పెడితే కనీస అర్హత ఉన్న ప్రతి పౌరుడికీ ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది.