న్యూఢిల్లీ: దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో వరుసగా మూడోసారి ఓవరాల్ క్యాటగిరీలో మొదటి ర్యాంకును సాధించింది. టాప్-10 విద్యాసంస్థల్లో ఏడు ఐఐటీలే ఉండటం విశేషం. పరిశోధన, యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో బెంగళూరు ఐఐఎస్సీ మొదటి స్థానం సాధించింది. జేఎన్యూ రెండో అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది. ఇంజినీరింగ్ సంస్థల క్యాటగిరీలో టాప్ 10లో ఎనిమిది ఐఐటీలు ఉన్నాయి. బిజినెస్ స్కూళ్లలో ఐఐఎం అహ్మదాబాద్, మెడికల్ కాలేజీల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ అగ్రస్థానాలు సాధించాయి.
హెచ్సీయూకు 9వ ర్యాంకు
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 32వ ర్యాంకు సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్లో 62వ స్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్ ఓవరాల్ ర్యాంకింగ్లో 16వ ర్యాంకు పొందగా, ఇంజినీరింగ్ విభాగంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. వర్సిటీల ర్యాంకింగ్లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఓవరాల్గా 17వ ర్యాంకు సాధించింది. లా విభాగంలో టాప్ 30 కాలేజీల్లో హైదరాబాద్కు చెందిన రెండు విద్యా సంస్థలకు చోటు లభించింది. ఇందులో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు 3వ ర్యాంకు రాగా.. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్కు 29వ ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్లో తొమ్మిది ఇంజినీరింగ్ కాలేజీలకు టాప్ 200లో చోటు దక్కింది.