హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా టీకాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థగా సీరం ఇన్స్టిట్యూట్కు పేరున్నది. ఆ సంస్థకు దీటుగా హైదరాబాదీ సంస్థ బయలాజికల్-ఈ (బీఈ) కూడా టీకా ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నది. మరో ఏడాది కాలంలో సుమారు 100 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈ మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొంటున్నది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు టీకా తెస్తుండటం, ఇతర సంస్థల టీకాలను ఉత్పత్తి చేస్తుండటం గర్వంగా ఉన్నదని బయలాజికల్-ఈ ఎండీ మహిమ దాట్ల తెలిపారు.
30 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్
బయలాజికల్-ఈ సంస్థ సొంతగా టీకాను అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం తాజాగా 30 కోట్ల డోసులకు ఈ సంస్థతో ఒప్పందం చేసుకున్నది. రూ.1,500 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చింది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య వీటిని అందించాల్సి ఉంటుంది.
క్యూలో విదేశీ టీకాలు..
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన టీకాను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు బయలాజికల్-ఈ ఒప్పందం చేసుకున్నది. మొత్తం 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. వీటిని వచ్చే ఏడాది ప్రథమార్థంలోగా అందించనున్నది. మరోవైపు, కెనడాకు చెందిన ఫార్మా సంస్థ ప్రొవిడెన్స్ థెరపుటిక్స్ అభివృద్ధి చేసిన కరోనా టీకాను సైతం బయలాజికల్-ఈ ఉత్పత్తి చేయనున్నది. కెనడా సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎం-ఆర్ఎన్ఏ టీకా ‘పీటీఎక్స్-కొవిడ్-19 బీ’ సాంకేతికతను బయలాజికల్-ఈకి సరఫరా చేయనున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి 3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. మొత్తంగా 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు, పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తున్న ‘సీఈపీఐ’ (కొయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్) బయలాజికల్-ఈతో ఒప్పందం చేసుకున్నది. ఈ సంస్థకు బయలాజికల్-ఈ 10 కోట్ల డోసులు అందించనున్నది.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు
బయలాజికల్ ఈ గతేడాది ఆగస్టులో వ్యాక్సిన్ తయారీకి అనుమతులు సాధించింది. అదే సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్తో ఒప్పందం చేసుకొన్నది. వెంటనే తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి బయలాజికల్-ఈ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 80-85 కోట్ల డోసులు. తాజా ఒప్పందాల నేపథ్యంలో అమెరికాకు చెందిన అకోర్న్ ఫార్మా సంస్థకు చెందిన హిమాచల్ప్రదేశ్లోని వ్యాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్ను అద్దెకు తీసుకున్నది. ఇక్కడ ఏటా సుమారు 14 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయవచ్చు. అదనంగా మరో 3 కోట్ల ఉత్పత్తిని పెంచేలా విస్తరణ ప్రారంభించింది. దీంతో ఏటా వంద కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించింది. ఫలితంగా సీరం ఇన్స్టిట్యూట్ (160 కోట్ల డోసులు) తర్వాత అతిపెద్ద సంస్థగా నిలిచింది.