నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఎగువన కరుస్తున్న భారీవర్షాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వానలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి ఉప్పొంగుతున్నది. వాగులు, వంకల గుండా వస్తున్న భారీవరదతో ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నది. అటు కృష్ణా నదిలోనూ భారీ ఇన్ఫ్లోలు వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకొన్నాయి.
10 గంటలు.. 20 టీఎంసీలు
గోదావరి ఉగ్రరూపంతో శ్రీరాంసాగర్లో 10 గంటల్లోనే 20 టీఎంసీల నీరు చేరింది. ఈ నెల మొదటి వారం నుంచి ఎగువన మహారాష్ట్రలోని బాలేగావ్ బ్యారేజీ, విష్ణుపురి ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు తోడు గురువారం ఊహించని విధంగా వరద వచ్చింది. ఉదయం 70 టీఎంసీలుగా ఉన్న ఎస్సారెస్పీ నీటిమట్టం సాయంత్రానికి గరిష్ఠ నీటిమట్టం 90 టీఎంసీలకు చేరింది. దీంతో అధికారులు 42 గేట్లలో 33 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎస్సారెస్పీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రికార్డుస్థాయిలో 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ప్రాజెక్టులో సగానికి కంటే తక్కువ నీరు నిల్వ ఉన్నది.
మానేరు పరవళ్లు
మూడురోజులుగా దంచికొడుతున్న వర్షాలతో మానేరు ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే ఎగువమానేరు మత్తడి దుంకుతతున్నది. 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగా, 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 9940 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం 25.50 టీఎంసీలతో పూర్తిస్థాయికి చేరుకున్నది. 89,325 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 22 గేట్లు ఎత్తి 1,03,284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్ఎండీ 24.034 టీఎంసీలకు 22 టీఎంసీలకు చేరుకున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5,78,756 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 40 గేట్ల ద్వారా 6,79,090 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకు 18.452 టీఎంసీలు నీరున్నది. పార్వతి బరాజ్లోకి 7,97,690 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 68 గేట్లను ఎత్తి 7,96,690 క్యూసెక్కులను వదులుతున్నారు.
జూరాలకు స్థిరంగా వరద
కృష్ణాపై ప్రియదర్శిని జూరాల జలాశయానికి స్థిరంగా వరద కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి భారీగా నీటివిడుదల కొనసాగుతుండంతో 54 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ఇన్ఫ్లో నమోదవుతున్నది. గురువారం సాయంత్రం 6 గంటలకు 57,849 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. గురువారం 63,016 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు, 846 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 72.0497 టీఎంసీల నిల్వ ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.