న్యూఢిల్లీ, మే 21: పెద్దల కంటే పిల్లలపైనే థర్డ్వేవ్ అధిక ప్రభావం చూపనుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం సహజంగానే తక్కువగా ఉన్నందున థర్డ్వేవ్లోనూ వారికి పెద్దగా ప్రమాదం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పిల్లల రక్షణకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, వచ్చే మూడు నాలుగు నెలల్లో టీకాలకు ఆమోదం లభించే అవకాశం ఉన్నదని చెప్పారు. కుటుంబంలోని పెద్దవారందరికీ కరోనా వైరస్ సోకినా, పిల్లలకు ముప్పు తక్కువేనని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. దేశంలో మ్యుకోర్మైకోసిస్ (బ్లాక్ఫంగస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ను అరికట్టడానికి మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సి ఉన్నదన్నారు.
కొవిడ్ కేసులు తగ్గితే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. అయితే దీనిని బ్లాక్ ఫంగస్ అని పిలువడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ఇది మ్యుకోర్మైకోసిస్.. బ్లాక్ ఫంగస్కాదు. రక్త సరఫరా తగ్గడంతో చర్మం రంగు మారి నల్లగా అవడంతో దీన్ని బ్లాక్ ఫంగస్ అంటున్నారు’ అని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడడం, డయాబెటిస్ వంటి రుగ్మతల కారణంగా మ్యుకోర్మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తున్నాయని చెప్పారు. షుగర్ను అదుపులో ఉంచుకోవాలని, స్టెరాయిడ్ల వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించారు. బ్లడ్ థిన్నర్ల (బ్లడ్ క్లాట్లను నిరోధించేవి) వినియోగంపై స్పందిస్తూ.. ‘తేలికపాటి అనారోగ్యం ఉన్నవారు బ్లడ్ థిన్నర్లు వినియోగించకూడదు. అధిక వినియోగం వల్ల అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదమున్నది’ అని పేర్కొన్నారు.
వ్యవధి పెంపు సరైనదే
మూడు, నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని ప్రశ్నించగా.. ‘వైరస్ ఉత్పరివర్తనం చెందుతున్నందున వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాల్సి ఉన్నది. సమీప భవిష్యత్తులో మనం బూస్టర్ డోస్ తీసుకోవాల్సి రావచ్చు. లేదా తరచూ వ్యాక్సిన్లు తీసుకునే అవసరం పడొచ్చు’ అని అన్నారు. టీకాల మధ్య వ్యవధి పెంపు సరైనదేనని గులేరియా సమర్థించారు. వ్యవధి పెంచితే వ్యాధి నిరోధకత పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధంపై ఆయన స్పందిస్తూ.. దీన్ని గేమ్చేంజర్ అనడం తొందరపాటు అవుతుందని చెప్పారు.