న్యూఢిల్లీ, మే 15: కరోనా సెకండ్వేవ్ గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున.. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కరోనా టెస్టులు నిర్వహించటంపై, స్థానికంగా వైరస్ కట్టడి (కంటైన్మెంట్) వ్యూహాలను అమలుపర్చటంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్పై మోదీ సమీక్షించారు. గ్రామీణప్రాంతాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న చోట ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు జిల్లా అధికారులకు మార్గనిర్దేశనం చేయాలని ప్రధాని ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటికే ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వరపరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా జరుగాలని ప్రధాని ఆదేశించటం విశేషం. మరోవైపు, ప్రస్తుత సెకండ్వేవ్లో ఇంటింటి పరీక్షలతోపాటు, గ్రామాల్లో స్థానికంగా ఎక్కడికక్కడ కరోనా వ్యాప్తిని నిలువరించే వ్యూహాలను అమలుచేయటం తక్షణ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు.
రాష్ట్రాలపై ఒత్తిడి లేకుండా చూడండి
కరోనా కేసులు, మరణాల సంఖ్యను పలు రాష్ట్రప్రభుత్వాలు తగ్గించి చూపుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో.. ‘కేసులు, మరణాల సంఖ్య వెల్లడిలో పారదర్శకంగా ఉండేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలి. ఎక్కువసంఖ్యలో కేసులు, మరణాలు ఉండటం అనేది రాష్ట్రాలపై ప్రతికూలప్రభావం చూపించేలా ఒత్తిడి ఉండకూడదు’ అని ప్రధాని చెప్పారు. గ్రామీణప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆక్సిజన్ కంటైనర్లను వినియోగించటంలో ఆరోగ్య సిబ్బందికి శిక్షణనివ్వాలని, వైద్యపరికరాలు నిరంతరం పని చేయటానికి వీలుగా కరెంటు సరఫరాలో సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన అన్ని రకాల సామగ్రి ఇచ్చి వారి కృషిని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ.. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం పంపిణీ చేసిన వెంటిలేటర్లు కొన్ని రాష్ట్రాల్లో నిరుపయోగంగా పడి ఉంటున్నాయన్న వార్తలపై స్పందిస్తూ.. తక్షణం దీనిపై ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులను మోదీ ఆదేశించారు.
కేంద్రానికి వివరాలిచ్చిన రాష్ట్రం
కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పాల్గొన్న రాష్ట్ర మంత్రి హరీశ్రావు తెలంగాణలో జరుగుతున్న ఇంటింటి సర్వే వివరాలను వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం తెలంగాణలో ఇంటింటి ఆరోగ్య సర్వే జరుపుతున్నామని హరీశ్రావు చెప్పారు. కరోనా, జ్వర పీడితులను గుర్తించడం, మెడికల్ కిట్లు అందించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు. తెలంగాణలో ఇంటింటి సర్వే విధి విధానాలను, ఫలితాలను శ్రద్ధగా రాసుకొన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వాటిని ప్రధానమంత్రి మోదీకి నివేదించినట్టు తెలిసింది.