సిద్దిపేటలో విద్యార్థి జేఏసీ సమావేశం,టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
సిద్దిపేట, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్లో ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. అందుకే ఓటర్లకు కుట్టుమెషిన్లు, నోట్ల కట్టలు, గోడ గడియారాలు, మిక్సీలు, కుంకుమ భరిణీలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీకి పోతివి. నీ ఆత్మగౌరవాన్ని జాతీయపార్టీలో తాకట్టు పెడితివి. నీ బ్లడ్ లెఫ్ట్ అంటివి. నీ డీఎన్ఏ లెఫ్ట్ అంటివి. రైట్ పార్టీలోకి ఎలా పోతివి? నీ స్వార్థం కోసం నీ డీఎన్ఏను కూడా పక్కన పెట్టినవు కదా!. నీకు ఆత్మగౌరవం ఎక్కడిది? ఆత్మగౌరవం అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకు ఉన్నదా?’.. అని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండల బీజేపీ, కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు, ముదిరాజ్లు, జమ్మికుంట పద్మశాలి, వడ్డెర సంఘం, హమాలీ సంఘం నాయకులు, సిరిసిల్లపల్లికి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థి విభాగం నాయకులతో సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నోట్లు ఇస్తే ఓట్లు రావన్న ఈటల.. గెలుపు కోసం లారీల కొద్ది కుట్టుమెషిన్లు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను దించుడు మొదలుపెట్టారని విమర్శించారు. ఈటలకు హుజూరాబాద్ ప్రజల మద్దతే ఉంటే ఇంత భయమెందుకు?, ఓడిపోతాననే భయం పట్టుకొని అప్పుడే పంచుడు మొదలుపెట్టావా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని నిలదీశారు. ‘నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. ఎన్ని వస్తువులు ఇచ్చినా, హుజూరాబాద్ ప్రజల మనసును గెలుచుకోలేవు’ అని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర
త్వరలోనే హుజూరాబాద్ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తారని హరీశ్రావు వెల్లడించారు. ఈ యాత్రలో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గడప గడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతే అభివృద్ధి ప్రచారకులు కావాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, టీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ విద్యార్థ్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, విద్యార్థ్ధి విభాగం జేఏసీ నాయకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు ఇండ్లయినా కట్టకపోతివి
డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్కు నాలుగు వేల ఇండ్లు ఇస్తే నాలుగు ఇండ్లయినా కట్టకపోతివని ఈటలను విమర్శించారు. నిజంగా పేదలకు నాలుగు వేల ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించి ఉంటే.. ఇవ్వాళ నాలుగు వేల కుటుంబాలు ఆత్మగౌరవంతో బతికి ఉండేవి కదా అని పేర్కొన్నారు. ఈటల కారణంగా ఆత్మగౌరవం అనే పదానికి అర్థమే మారిపోయిందని, దీనికి డిక్షనరీలో అర్థ్దం మార్చాలని ఎద్దేవాచేశారు. నరేంద్రమోదీ, అమిత్షాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే తప్పు పట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్ల్లీకి గులాంగిరీ చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకని, తమ పార్టీకి తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టంచేశారు. ‘మనం ప్రజలకు గులాం చేస్తాం. బీజేపీ వాళ్లు ఢిల్ల్లీకి గులాం చేస్తారు’ అని కాషాయ పార్టీకి చురకలు అంటించారు.
‘నోట్లు ఇస్తే ఓట్లు రావన్న ఈటల.. గెలుపు కోసం లారీల కొద్ది కుట్టుమెషిన్లు, గడియారాలు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను దించుడు మొదలుపెట్టిండు. ఈటలకు హుజూరాబాద్ ప్రజల మద్దతే ఉంటే ఇంత భయమెందుకు? ఓడిపోతాననే భయం పట్టుకొని అప్పుడే పంచుడు మొదలుపెట్టావా?, ఈటల కారణంగా ఆత్మగౌరవం అనే పదానికి అర్థమే మారిపోయింది. దీనికి డిక్షనరీలో అర్థ్దం మార్చాలి’. – మంత్రి హరీశ్రావు