న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించే హాల్మార్కింగ్ పద్ధతిని జూన్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆభరణ వ్యాపారులు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)కు మారేందుకు నిర్ణయించిన గడువును పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వం పసిడి స్వచ్ఛతను నిర్ధారించేందుకు హాల్మార్కింగ్ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్లోనే నిర్ణయించింది. ఇందుకోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కానీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును జూన్ 1 వరకు పొడిగించింది. ఇకపై ఈ గడువును పొడిగించేది లేదని, హాల్మార్కింగ్ పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తాజాగా ప్రకటించింది. జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని అమ్మేందుకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34,647 మంది ఆభరణ వ్యాపారులు బీఐఎస్తో రిజిస్టరయ్యారు. రానున్న రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. సోమవారం రూ.46,223 పలికిన తులం బంగారం ధర.. మంగళవారం రూ.130 తగ్గి రూ.46,093కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.66,345 నుంచి రూ.66,040కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.