కరీంనగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చే స్తున్నదో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదో మీ కండ్ల ముందున్నది. ప్రజల కోసం మా ప్రభుత్వం ఏం చేస్తున్నదో మేం చెప్తాం.. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. అన్నం పెట్టేవారిని ఆదరిస్తారో..?, పన్నులు వేసి నడ్డి విరిచే వారి వెంట పోతారో? హుజూరాబాద్ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ఆర్థిక మం త్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చేనేత కార్మికులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన సబ్సిడీలు, ఎక్స్గ్రేషియా చెక్కులను మంత్రి గంగుల కమలాకర్తో కలి సి పంపిణీచేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కార్మికుల వ్యక్తిగత, సహకార సంఘాలకు రూ.100కోట్ల రుణాలు మాఫీ చేశా మన్నారు. త్రిఫ్ట్ పథకాన్ని తిరిగి కొనసాగిస్తున్నామని, యార్న్పై 40 శాతం సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు 50ఏండ్లకే ఆసరా పింఛన్ ఇస్తున్నామని, త్వరలో చేనేతబీమా అమలుచేస్తామని చెప్పారు.
గుండెలమీద చేయి వేసి ఆలోచించండి
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందో, ఏంచేస్తదో గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. అనుకోకుండా హుజూరాబాద్లో ఎన్నిక వస్తే కాళ్లు పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, బొట్టు బిల్లలు, గోడ గడియాలు పంచుతున్నారని మండిపడ్డారు. మీ కడుపు నింపేది ఎవరు?, కాపాడుకుంటున్నది ఎవరో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ ఇప్పటికే త్రిఫ్ట్ పథకం కింద రూ.30 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. కార్మికుల సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాల కోసం మరో రూ.73 కోట్లు విడుదల చేశారని, అందులో హుజూరాబాద్ చేనేతసొసైటీకి రూ.1.90 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సొసైటీకి ఇంకా 20 శాతం రీఎంబర్స్మెంట్ కింద రూ. 23,69,900, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కింద రూ.19,27,416, పావలా వడ్డీ కింద రూ. 3,09,390, టెస్కో ద్వారా రావాల్సిన రూ. 45,68,742 పంపిణీ చేశారు. చేనేత మిత్ర పథకం కింద రూ.96,12,850, వివిధ కారణాలతో మరణించిన 20 మంది కుటుంబాలకు రూ.12,500 చొప్పున రూ. 2,87,500 విలువైన చెక్కులను అందజేశారు. హుజూరాబాద్లో కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుతో అన్ని సౌకర్యాలున్న ఫంక్షన్హాలు నిర్మిస్తామని, ఇప్పటికే రూ. కోటి ఇచ్చామని, మరో కోటి కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
దండంపెట్టినా చూడలే: మంత్రి గంగుల
హుజూరాబాద్ పద్మశాలీల కోసం 10 గుం టల స్థలం, కమ్యూనిటీ హాలుకు రూ.50 లక్షలు కావాలని దండం పెట్టి అడిగినా ఈటల పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ను అడగగానే ఎకరం స్థలంతోపాటు రూ.కోటి మంజూరు చేశారని, నిర్మాణం కూడా ప్రారంభించామని చెప్పారు. చేనేత రంగానికి రూ.100 కోట్లు ఉన్న బడ్జెట్ను సీఎం కేసీఆర్ రూ.1,200 కోట్లకు పెంచారని మాజీ మంత్రి ఎల్ రమణ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీ సొమ్మేం పోతుంది..
చేనేత జౌళిశాఖ ఏడీపై మంత్రి ఆగ్రహం
‘ప్రభుత్వమే ఇస్తానంటుంది. రూ. 1,200 కట్టొద్దని మా కార్మికులను బెదిరిస్తున్నారట. ఏంది నీ కథ.. నీ సొమ్మేం పోతోంది చెప్పు’ అంటూ చేనేత జౌళిశాఖ ఏడీ సంపత్పై మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. త్రిఫ్ట్ పథకం కింద రూ.800, రూ.1,200 చెల్లించే వెసులుబాటు ఉన్నా.. ఏడీ కేవలం రూ.800 మాత్రమే చెల్లించాలని చెబుతున్నట్టు చేనేత కార్మికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి హరీశ్రావు.. ఏడీ సంపత్ను వేదికపైకి పిలిచి నిలదీశారు.
ప్రజల ఆస్తుల్ని యథేచ్ఛగా అమ్మేస్తున్న బీజేపీ
కమలాపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంస్థలను యథేచ్ఛగా అమ్మే స్తుందని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో సోమవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు వేల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేనేత కార్మికులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం అమ్మకానికో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో విపక్షాలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని తెలిపారు.