మహారాష్ట్రలోని నాసిక్లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు రోజూ మొబైల్లో ఆన్లైన్ క్లాసులను శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్లతో సహా ఇంటి నుంచి మాయమయ్యారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు వారిని ఓ రైల్వే స్టేషన్లో పట్టుకొన్నారు. ఎక్కడికెళ్తున్నారని అడిగితే ముంబైలో ‘ఫ్రీ ఫైర్’ గేమింగ్ కాంపిటీషన్ ఉంది ఆడటానికి వెళ్తున్నామని చెప్పారు. ఫోన్లో పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడం లేదని, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారని అప్పటిదాకా ఆ తల్లిదండ్రులకు తెలియదు.
మిర్చీ బండి నడిపే శ్రీనివాస్ కొడుకు కార్తీక్ 7వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసమని శ్రీనివాస్ తన కుమారుడికి ఫోన్ కొనిచ్చాడు. రోజూ సాయంత్రం కార్తీక్ మిర్చి బండి దగ్గరకు వస్తున్నాడు. తండ్రికి అనుమానం రాకుండా కొంచెంకొంచెం డబ్బు తీసుకొంటున్నాడు. శ్రీనివాస్కు విషయం తెలిసింది. ఆరా తీస్తే ఆ డబ్బులను ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ఆడటానికి ఖర్చు పెడుతున్నాడని తెలిసింది. కొడుకు చదువు సంగతి తర్వాత గానీ, ఇప్పుడు ఆ ఆటను మాన్పించడం శ్రీనివాస్కు భారంగా మారింది.
సాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా వ్యవసాయ పనులకు వెళ్లి ఏడువేల దాకా సంపాదించాడు. కొడుకు తన ఖర్చులకు తానే సంపాదిస్తున్నాడని తండ్రి మురిసిపోయాడు. కానీ ఆ డబ్బులను సాయి ‘ఫ్రీ ఫైర్’ గేమ్లో తన క్యారెక్టర్ కోసం ఆయుధాలు, డ్రెస్సులు కొనడానికి ఖర్చు పెట్టాడు. మందలిస్తే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలో పబ్జీ పై నిషేధం విధించాక.. పీడ విరగడైందని పిల్లల తల్లిదండ్రులు ఊపిరి తీసుకొంటున్న సమయంలోనే ఫ్రీ ఫైర్ రూపంలో మరో ‘మహమ్మారి’ వచ్చి పడింది. ఆటవిడుపు కోసం ఈ గేమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొన్నవారు దానికి బానిసలుగా మారుతున్నారు. ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు, ఫోన్లు లాక్కొన్నందుకు పిల్లలు చనిపోయిన, చనిపోవడానికి యత్నించిన సందర్భాలు ఉన్నాయి. అచ్చం పబ్జీ లాగే ఉండే ఈ ఆట పబ్జీ కన్నా ప్రమాదకరంగా మారడానికి మరో కారణం కరోనా మహమ్మారి కారణమని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పిల్లల చేతిలో ఫోన్లు నిరంతరం ఉంటున్నాయి. క్లాసులు పూర్తయినా, ప్రత్యేక తరగతలంటూ తల్లిదండ్రులను నమ్మిస్తూ ఆటల్లో మునిగిపోతున్నారు.
మొదట ఉచితం.. తర్వాతే అసలు ఆట
ఈ గేమ్ డౌన్లోడ్, ఆడటం మొదట ఉచితమే. పోనుపోను అది మన క్యారెక్టర్ కోసం ఆయుధాలు, దుస్తులు కొనేలా ప్రోత్సహిస్తుంది. స్నేహితులతో కలిసి ఆడేది కావడంతో, స్నేహితుల క్యారెక్టర్కు ఎలాంటి దుస్తులున్నాయి? తమకు ఎలాంటివి ఉన్నాయని పోల్చుకొని ఖర్చు పెడుతున్నారు. ఖమ్మంలో సంహిత్ పిల్లగాడు రూ.40వేలు పెట్టి తన క్యారెక్టర్ కోసం దుస్తులు, గన్ కొనుగోలు చేశాడంటే ఈ గేమ్ ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమవుతున్నది. ఆటలో హింస కూడా పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటలో ఉన్న క్యారెక్టర్ తామే అన్న భావన పిల్లలో ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆటలో పాల్పడే హింస వారి మనసులపై ముద్ర వేస్తుందని, అది నిజజీవితంలో కూడా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు.
ఎలా ఆడతారు..
ప్లే స్టోర్లో ప్రీ ఫైర్ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా గేమ్ ఆడొచ్చు. గేమ్లో సింగిల్ (ఒక్కరు), డియో(ఇద్దరు) స్క్వాడ్ (నలుగురు) ఇలా వ్యక్తిగతంగా లేదా టీమ్గా కలిసి ఈ గేమ్ ఆడుతారు. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీరు ఆట ఆడేందుకు ఏదో ఒక క్యారెక్టర్ను ఎంపిక చేసుకోవాలి. ఇలా నాలుగైదు క్యారెక్టర్లు ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ ఆప్షన్లో ఉన్నవి కాకుండా కొత్త క్యారెక్టర్లు కావాలంటే క్యారెక్టర్కు రూ.500 చెల్లించాలి. ఇలా ఎన్ని క్యారెక్టర్లు కావాలనుకుంటే అన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మన క్యారెక్టర్లకు వేసే డ్రెస్సులు, కార్లు, బైక్లు, తుపాకులు ఇలా ప్రతీదానికి మళ్లీ డబ్బు పెట్టి కొనుగోలు చేయాలి. ఇలా డిజైన్ చేసిన క్యారెక్టర్ను వేలం వేసుకొనే వెసులుబాటు కూడా ఈ గేమ్లో ఉంది. నచ్చినవాళ్లు ఎక్కువ మొత్తం డబ్బు పెట్టి కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా పిల్లలు తమ క్యారెక్టర్ డిజైన్ను వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. తద్వారా తాము పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ డబ్బులు రావొచ్చనేది వారి ఆశ. ఆటలో లాగిన్ కావాలంటే ఫేస్బుక్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్ సమాచారం దుర్వినియోగం కావొచ్చని సమాచార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, గేమ్ కాంపిటీషన్లు, గెలిచినవారికి నగదు బహుమతులు ప్రకటించడం లాంటి విషయాలు పిల్లలు ఈ ఆటవైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి.
2019లో బెస్ట్ పాపులర్ వోట్ గేమ్ అవార్డు
2017లో ఫ్రీ ఫైర్ గేమ్ విడుదలైంది. అప్పటి నుంచే విశేష ఆదరణ పొందింది. 2019లో గూగుల్ ప్లేస్టోర్లో అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకొన్న ఆటగా ఫ్రీ ఫైర్గేమ్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాదికి గూగుల్ప్లే స్టోర్ దీనికి బెస్ట్ పాపులర్ వోట్ గేమ్ అవార్డు ప్రకటించింది. అప్పటికే పబ్జీ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొంది ఉంది. కాబట్టి ఈ ఆటపై ఎక్కువగా ఎవరూ దృష్టి పెట్టలేదు. గతేడాది సెప్టెంబర్ 3న కేంద్రం పబ్జీపై నిషేధం విధించడంతో పిల్లలు, మొబైల్ గేమ్స్ ప్రియుల చూపు ఫ్రీ ఫైర్ వైపు మళ్లింది.