పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. ప్రతి ఒక్కరూ దానికి ప్రత్యామ్నాయాలను వెదికే పనిలో పడ్డారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు భారతప్రభుత్వం ఇథనాల్ వంటి ఇంధనాల ఉత్పత్తి పెంపును ప్రోత్సహిస్తున్నది. దాంతో తెలంగాణలో బియ్యపు నూకనుంచి ఇథనాల్ను తయారుచేయటంపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో వరి దిగుబడి అనూహ్యంగా పెరగటంతో ఇథనాల్కు అవసరమైన ముడిసరుకు పుష్కలంగా లభించే అవకాశం ఉన్నది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించే పనిలో పడింది.
హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రైస్, పారా బాయిల్డ్ మిల్లుల నుంచి ఉత్పత్తయ్యే బియ్యపు నూక నుంచి ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. పెట్రోల్లో కలిపేందుకు చెరుకు మిల్లుల నుంచి వెలువడే మొలాసిస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న ఇథనాల్ను కేంద్ర పెట్రోలియం సంస్థలే కొంటున్నాయి. ప్రస్తుతం మనదేశంలో పెట్రోల్లో ఐదు శాతం ఇథనాల్ కలుపుతుండగా, 2025 నాటికి 10 శాతం, 2030 నాటికి 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలు ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టిపెట్టాయి. మన రాష్ట్రంలో కూడా ఇథనాల్ ఉత్పత్తి వనరులపై ప్రభుత్వం దృష్టిసారించింది.
భారీగా ముడి సరుకు..
మన రాష్ట్రంలో ఇదివరకే వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులు చాలావరకు అందుబాటులోకి రావటంతో వరి దిగుబడి భారీగా పెరిగింది. దాంతో ప్రతిపాదిత మెగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కూడా ఎక్కువగా రైస్ మిల్లులు, పారా బాయిల్డ్ మిల్లుల ఏర్పాటు దరఖాస్తులే అందాయి. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులు భారీగా ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో వాటి ద్వారా పెద్ద ఎత్తున నూక వస్తుంది. ఈ నూకను ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ మేరకు నూకల ఉత్పత్తి ఉంటుంది, వాటి ద్వారా ఎంతమేరకు ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు అనేదానిపై అధ్యయనం చేసి అధికారులు ఓ నివేదికను తయారుచేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
పెట్రోల్తో పోల్చితే సగం ధరకే ఇథనాల్..
మొలాసిస్ ద్వారా ఇథనాల్ తయారీకి లీటరుకు రూ.40 ఖర్చవుతుంది. నూకలు, ఇతర ధాన్యాల ద్వారా తయారుచేసేందుకు దాదాపు రూ. 50వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ పెట్రోల్ ధరతో పోల్చితే సగం ధరకే ఇథనాల్ తయారుచేసే వీలుంది. ఒక్కో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు కనీసం రూ.100 కోట్లు అవసరం. వాటికి సరిపడా ముడిసరుకు లభించినప్పుడే అవి కొనసాగుతాయి. అందుకే ముడి సరుకు ఉత్పత్తి ఏ మేరకు ఉంటుంది, ఎంత సామర్థ్యంతో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు అనేదానిపై అధికారులు కసరత్తు పూర్తిచేశారు.
5,700 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రవ్యాప్తంగా 5,700 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేసేందుకు పరిశ్రమలశాఖ చర్యలు ప్రారంభించింది. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకం కింద కొత్తగా యూనిట్ ఏర్పాటు చేసేవారికి ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. 35 శాతం గ్రాంటు రూపంలో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సహాయం అందిస్తారు. ఇప్పటికే కొనసాగుతున్న కోటి రూపాయలకన్నా తక్కువ వ్యయమయ్యే యూనిట్లను అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. మొత్తం 17,000 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సర్వే ద్వారా గుర్తించగా, అందులో 5,700 యూనిట్లను ఈ పథకం కింద వచ్చే నాలుగేండ్లలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రైస్ మిల్లులు, దాల్ మిల్లులు, కిరాణ దుకాణలు, చికెన్-మటన్ షాపులు, హోటళ్లు మినహా ఇతరత్రా ఆహార పదార్థాల ప్రాసెసింగ్కు సంబంధించిన అన్ని రకాల యూనిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. పండ్ల రసం, కారం, పసుపు, వేరుశనగ గింజలు, పాల ఆధారిత ఉత్పత్తులు, సోయాబీన్, మిల్లెట్స్, మామిడి పచ్చడి, రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్, పండ్లు, కూరగాయల ఉత్పత్తులు ఇందులో ముఖ్యమైనవి. యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే 850 దరఖాస్తులు వచ్చినట్టు, ఇందులో 55 దరఖాస్తులు బ్యాంకు రుణాలకోసం వెళ్లినట్టు అధికారులు తెలిపారు.