కరోనా థర్డ్వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనేది వాస్తవమైనా.. కాకపోయినా.. పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి సూచించారు. మొదటి వేవ్ 60 ఏండ్లు పైబడినవారిపై, రెండో వేవ్ యువతపై ప్రభావం చూపిన నేపథ్యంలో మున్ముందు కరోనా వేరియంట్లు పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అందుకే తల్లిదండ్రులకు టీకా వారితోపాటు వారి పిల్లలకు శ్రీరామరక్షగా పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం విద్యాసంస్థలు మూసి ఉన్నందున పిల్లలు పూర్తిగా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో వారికి వైరస్ తల్లిదండ్రుల ద్వారానే సోకే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా టీకా వచ్చేవరకు తల్లిదండ్రులు, కుటుంబంలోని పెద్దలంతా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఆ కుటుంబానికి రక్షణగా ఉంటుందని వివరించారు. కరోనా తాజా పరిస్థితులపై ప్రీతిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
వ్యాధిని ముదరపెట్టడంతోనే ప్రాణాపాయం
ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం, జలుబు, దగ్గు.. ఇలా ఏ లక్షణం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. విద్యావంతులు సైతం ఈ లక్షణాలున్నా సాధారణ అనారోగ్యమేనని అపోహతో పారాసిటమాల్ వంటి సాధారణ మందులు వేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో నాలుగైదు రోజుల్లో వైరస్ లోడ్ పెరిగి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. చివరకు ఆక్సిజన్ బెడ్, ఐసీయూ దాకా పరిస్థితి వెళ్తున్నది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేరు. రికవరీ అవకాశాలు సగమే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు మాత్రమే నిండిపోయాయి. కానీ సాధారణ పడకలు చాలావరకు ఖాళీగా ఉన్నాయి. వైరస్ సోకినప్పుడు ప్రాథమికంగా రోగి దవాఖానల్లో చేరితే ఇలాంటి సాధారణ పడకలపై ఉంచి చికిత్స అందిస్తారు. కానీ చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత రావడంతో అటు బెడ్లు దొరక్క, ఇటు రికవరీ అవకాశాలు తగ్గి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
కోలుకొనే అవకాశాలు మన చేతుల్లోనే..
కరోనాపై తప్పుడు సమాచారం, అశాస్త్రీయ వీడియోలు చూసి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి వైరస్ సోకినా కోలుకొనే అవకాశాలు పుష్కలంగా మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటికీ కరోనాపై నిర్దిష్టమైన చికిత్సా విధానం ఖరారు కాకపోయినా.. గత ఏడాది అనుభవంతో దాని నుంచి సులువుగా బయటపడొచ్చని అర్థమైంది. ఇందుకు లక్షణాలు ఉండగానే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో 20 యూనిట్ల కంటే తక్కువగా కౌంట్ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి దవాఖానలో చేరాలి. ఒకవేళ 20 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. స్వల్ప లక్షణాలుంటే హోం ఐసొలేషన్లోనే కోలుకోవచ్చు. దీంతోపాటు ప్రధానంగా కొవిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే వైద్యుడి సూచనతో తగిన మందులు వాడితే సరిపోతుంది. వైరస్ లోడ్ ఎక్కువగా ఉండి, తీవ్ర లక్షణాలు ఉన్నవారు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావాన్ని తెలుసుకొని తద్వారా వైద్యసేవలు పొందవచ్చు. లక్షణాలు గుర్తించిన ఒకట్రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియలన్నీ నిర్వహిస్తే ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, పరిస్థితి ఐసీయూ దాకా వెళ్లడమనేది ఉండదు.
రికవరీ రేటును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కరోనాతో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ అవి ఎంతమేర ఉన్నాయనేది ఆలోచించాలి. మరణాలు తెలంగాణలో ఒక్క శాతంలోపే ఉన్నాయి. అంటే 99% మంది కోలుకుంటున్నారనే వాస్తవాన్ని గుర్తించాలి. కరోనా బారిన పడినవారు కూడా రికవరీ రేటు చూసి ధైర్యంగా ఉండాలి. బాధితులు ధైర్యంగా ఉంటే వైద్యులు సూచించిన మందులు కూడా మంచిగా పనిచేసి త్వరగా కోలుకొనే అవకాశం ఉంటుంది. 100 మందిలో 70% మంది సాధారణ చికిత్సతో కోలుకొంటే, మిగిలిన 30 శాతమే ఆక్సిజన్, ఐసీయూ వరకు వెళ్తున్నారు. వీరిలోనూ కొందరే మరణిస్తున్నారు. అందులోనూ వారిలో భయం గుండెపోటుకు దారి తీసి అధిక మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే రికవరీ రేటును మీడియా హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది.
కొందరు నెమ్మదిగా కోలుకుంటారు..
కరోనా సోకి, చికిత్స అనంతరం 15 రోజుల తర్వాత కూడా వైరస్ పాజిటివ్ వస్తుందని అంటున్నారు. అంటే మరోసారి కరోనా వచ్చిందని కాదు. చికిత్స తర్వాత కూడా నయం కావడంలేదని కాదు. కొందరిలో శరీరతత్వాన్ని బట్టి నెమ్మదిగా కోలుకుంటారు. చికిత్స అనంతరం 15 రోజుల తర్వాత పాజిటివ్ రావచ్చుగానీ ఫలితాల్లో యూనిట్లు పరిశీలించినప్పుడు గతంలో ఉన్నంత తీవ్రత ఉండదు. కోలుకున్నవారు ఇక తమకు మళ్లీ సోకదనే అపోహలో ఉండొద్దు. ఒక్కసారి కరోనా వచ్చిందంటే తీవ్రతనుబట్టి కచ్చితంగా మన శరీరంలోని వివిధ అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చినా.. వైరస్, స్టెరాయిడ్స్ వాడిన దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే మంచి పౌష్టికాహారంతో ఆ దుష్ప్రభావాన్ని అధిగమించాలి. డబుల్ మాస్కు, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కడికక్కడ వైద్య సేవలు పెరగాలి
ప్రస్తుత ఆపత్కాలంలో అందరం ఒక తాటిపైకి వచ్చి విపత్తును ఎదుర్కోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగం సర్వశక్తులు ఒడ్డి కరోనాను ఎదుర్కొంటున్నది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. సీఎం కేసీఆర్ గాంధీ దవాఖానలో కరోనా రోగులను పరామర్శించడంతో సామాన్యుల్లోనే కాదు.. వైద్యులు, సిబ్బందిలో ఎంతో మనోధైర్యం వచ్చింది. ఇలా వైద్యరంగాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించాలేగానీ విమర్శలకు ఇది సమయం కాదు. ఆర్థికంగా ఉన్నవారు, ఇతర వనరులు ఉన్నవారు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా ఎక్కడికక్కడ వైద్యసేవలు విస్తరించి, దవాఖానలపై భారం తగ్గుతుంది. ప్రజలకూ ఆర్థికంగా ఊరట లభిస్తుంది.