హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం కొలువుదీరింది. చైర్మన్గా డాక్టర్ బీ జనార్దన్రెడ్డి శుక్రవారం ఉదయం 10:45 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రమాణం స్వీకరించారు. తాత్కాలిక చైర్మన్ చింతా సాయిలు ఆయనచేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత చైర్మన్ జనార్దన్రెడ్డి.. కమిషన్ సభ్యులు రమావత్ ధన్సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్రెడ్డి, డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ చేత ప్రమాణ చేయించారు. అనంతరం కమిషన్ పాలకమండలి విధుల్లో చేరినట్టుగా సంతకాలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 డిసెంబర్ 17న టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆరేండ్లపాటు పదవిలో ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో డీ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ చింతా సాయిలు టీఎస్పీఎస్సీకి తాత్కాలిక చైర్మన్లుగా వ్యవహరించారు. కొత్తగా కొలువుదీరిన కమిషన్ వారం రోజుల్లో తొలి సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి.
సుమిత్రా ఆనంద్ను సన్మానించిన మంత్రి వేముల
టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన సుమిత్రా ఆనంద్ తనోబాకు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శు భాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో మంత్రి ప్రశాంత్రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయన సతీమణి నీరజారెడ్డి.. సుమిత్ర ఆనంద్ తనోబా ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళకు టీఎస్పీఎస్సీలో అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్కు వేముల ధన్యవాదాలు తెలిపారు.
టీఎన్జీవోల శుభాకాంక్షలు
టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి.. సభ్యుడు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డిసహా మిగతాసభ్యులకు టీఎన్జీవో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వారికి పుష్పగుచ్ఛం, స్వీట్లు అందజేసి అభినందనలు తెలిపారు. ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వశాఖలు బలోపేతమవుతాయని, ప్రజలకు మెరుగైన సేవలందుతాయని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ అభిప్రాయపడ్డారు. టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఎంఏ ముజీబ్, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, విక్రమ్, శ్రీరామ్, మెడికల్ ఫోరం అధ్యక్షుడు కిరణ్రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.