సాధారణంగా రక్తంలో ప్రతిరక్షకాలను 0 నుంచి 1000 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐయూ)గా లెక్కిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 10 ఐయూల కన్నా తక్కువగా ఉంటే కరోనాను ఎదుర్కోలేము అన్న మూఢ నమ్మకం చాలామందిని వేధిస్తున్నది. అయితే, యాంటిబాడీ టెస్ట్ల వల్ల ఐయూల లెక్క మాత్రమే తెలుస్తుంది తప్ప ఆ పరీక్ష శరీరంలోని టీ-సెల్, బీ-సెల్ వల్ల కలిగే రోగనిరోధకశక్తిని సూచించదు. కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడంలో టీ-సెల్, బీ-సెల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
-యూఎస్ఎఫ్డీఏ నిపుణులు
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో ప్రతిరక్షకాల (యాంటిబాడీ)ల సంఖ్య పెరుగుతుందా? ఇటీవల చాలామందిని ఈ ప్రశ్న వేధిస్తున్నది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా వైరస్పై పోరాడేందుకు తమ శరీరంలో భారీ సంఖ్యలో యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయని చాలామంది భావిస్తున్నారు. ఈ అభిప్రాయంతో వైద్య నిపుణులు విభేదిస్తున్నారు. కరోనా బారినపడిన వారిలో ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఏ మేరకు తయారైందో తెలుసుకోవడానికి మాత్రమే యాంటిబాడీ పరీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. అంతే తప్ప అది వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష కాదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు డయాగ్నస్టిక్ సెంటర్లకు వచ్చి యాంటిబాడీ టెస్ట్ చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమలో ఏ స్థాయిలో యాంటిబాడీలు తయారయ్యాయో తెలుసుకొనేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
‘కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే రోగనిరోధకశక్తిని లేదా రక్షణ వ్యవస్థను అంచనా వేయడానికి యాంటిబాడీ పరీక్షలు ఉపయోగపడవు. అన్ని ప్రతిరక్షకాలు సమానంగా ఉత్పత్తి కావు. కరోనా వైరస్ అనంతరం ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాలకు, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఉత్పత్తి అయ్యే యాంటిబాడీలకు తేడా ఉంటుంది. కాబట్టి, ఓ వ్యక్తిలో ఏర్పడిన ప్రతిరక్షకాలు వ్యాక్సిన్ వల్లనా లేక వైరస్ సోకడం వల్లనా అన్నది గుర్తించలేము’ అని అమెరికాకు చెందిన ఆహార, ఔషధ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) వివరించింది. ఎంతో అనుభవమున్న వైద్య నిపుణులు సూచిస్తే తప్ప ఈ యాంటిబాడీ పరీక్షలను చేయించుకోరాదని తెలిపింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామంది ఈ యాంటిబాడీ పరీక్షలు చేయించుకుంటున్నారు.
కొంతమందిలో అసలు యాంటిబాడీలు ఉత్పత్తి కానట్టు ఫలితాలు వస్తున్నాయి. దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. యాంటిబాడీలలో వేర్వేరు రకాలు ఉంటాయి. మనం దేనికోసం పరీక్ష చేయిస్తున్నామో దానిని బట్టి ఫలితాలు వస్తాయి. వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తికి యాంటిబాడీలు అవసరం లేదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఓ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధకశక్తిని పెంచేందుకు వేర్వేరు విధానాలు ఉంటాయి’ అని అపొలో హాస్పిటల్స్ గ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ కే హరిప్రసాద్ వివరించారు. వ్యాక్సిన్ వల్ల పెరిగిన యాంటిబాడీల గురించి తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించుకోవద్దని తాము కూడా ప్రజలను హెచ్చరిస్తున్నామని యూఎస్ఎఫ్డీఏ తెలిపింది. కొవిడ్ బారినపడి కోలుకున్న వారిలో అభివృద్ధి చెందిన అనుకూల రోగనిరోధకశక్తిని గుర్తించడంలో యాంటిబాడీ పరీక్షలు కీలకమైన పాత్ర పోషిస్తాయని యూఎస్ఎఫ్డీఏ తెలిపింది. అయితే కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి, ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇటువంటి పరీక్ష చేయకూడదని సూచించింది.
యాంటిబాడీ కౌంట్
సాధారణంగా రక్తంలో ప్రతిరక్షకాలను 0 నుంచి 1000 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐయూ)గా లెక్కిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 10 ఐయూల కన్నా తక్కువగా ఉంటే కరోనాను ఎదుర్కోలేము అన్న మూఢనమ్మకం చాలామందిని వేధిస్తున్నది. అయితే, యాంటిబాడీ టెస్ట్ల వల్ల ఐయూల లెక్క మాత్రమే తెలుస్తుంది తప్ప ఆ పరీక్ష శరీరంలోని టీ-సెల్, బీ-సెల్ వల్ల కలిగే రోగనిరోధకశక్తిని సూచించదు. కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడంలో టీ-సెల్, బీ-సెల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని యూఎస్ఎఫ్డీఏ నిపుణులు పేర్కొన్నారు.