కరోనా కట్టడిలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలుచేస్తున్నట్టు డీజీపీ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా చట్టప్రకారం అన్నిచర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తూనే ఎమర్జెన్సీ, ఎసెన్షియల్ సర్వీస్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. లాక్డౌన్ అమలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు, అనుమతులు, ఈపాస్ల జారీ తదితర అంశాలపై డీజీపీ మహేందర్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
లాక్డౌన్ సమయంలో ఎవరెవరికి అనుమతి ఉంటుంది?
మెడికల్ ఎమర్జెన్సీ, డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది, మున్సిపల్, శానిటైజేషన్, విద్యుత్తు సహా ఎమర్జెన్సీ, ఎసెన్షియల్ సర్వీస్ల సిబ్బంది, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను (పూర్తి సిబ్బందిలో మూడువంతు), పోలీస్శాఖ నుంచి ఈ-పాస్లు పొందినవారు, ఇతర మినహాయింపు ఉన్నసేవలకు సబంధించినవారు ఐడీకార్డులు చూపితే అనుమతి ఉంటుంది.
సరుకు రవాణా వాహనాల విషయంలో ప్రత్యేకమైన ఆదేశాలు?
గూడ్స్ వాహనాలు లాక్డౌన్ సమయంలో ప్రత్యేకించి ఉదయం వేళల్లో నగరాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సరుకు రవాణా వాహనాలు లోడింగ్, అన్లోడింగ్ కూడా రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు పూర్తి చేసుకోవాలని సూచించాం.
ఈ-కామర్స్ , ఫుడ్డెలివరీ వంటి సర్వీస్ల విషయంలో..?
అవసరమైన మేరకు వారిని అనుమతిస్తున్నాం. అత్యవసర మందులు, ఆహారం, ఇతర వైద్య పరికరాలు సరఫరాచేసే ఈ-కామర్స్ డెలివరీ బాయ్స్ను అడ్డుకోవద్దని ఆదేశాలిచ్చాం. వారు లాక్డౌన్ సడలింపు సమయంలోనే వీలైనంత వరకు ఎక్కువ సరుకుల రవాణా చేసేలా చూసుకోవడం మంచిది. లాక్డౌన్ సమయంలో వీలైనంత తక్కువమంది సిబ్బందితో పూర్తిచేసుకోవాలి.
ఫార్మా పరిశ్రమలకు ఎవైనా మినహాయింపులున్నాయా?
ఫార్మా సహా కొన్ని పరిశ్రమలకు మినహాయింపు ఉన్నది. ఫార్మా కంపెనీల సిబ్బంది, కార్మికులు రెండుషిప్ట్లుగా విభజించుకుని పనిచేయాలని చెప్పాం. ఉదయం షిప్ట్వాళ్లు లాక్డౌన్ మినహాయింపు సమయంలోనే విధులకు వెళ్లినా, వారు తిరిగి వచ్చేందుకు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు అనుమతిస్తున్నాం. ఇతర పరిశ్రమలు, భవన నిర్మాణరంగంలో సిబ్బంది, కూలీలు పనిచేసేచోటే ఉండాలని జీవోలో స్పష్టంగా ఉన్నది. ఒకవేళ ఒకచోట నుంచి మరో పని ప్రదేశానికి వెళ్లాలంటే లాక్డౌన్ మినహాయింపు సమయంలోనే తరలించుకోవాలి.
రోడ్లపైకి వచ్చే వాహనాల్లో వేటిని సీజ్ చేస్తున్నారు?
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అదేవిధంగా నిజమైన ఎమర్జెన్సీ ఉన్న పాస్హోల్డర్స్ను అనుమతిస్తున్నాం. అలాకాకుండా పాస్లు పెట్టుకుని ఏ అవసరం లేకుండా, సరైన కారణం లేకుండా..రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
వ్యవసాయపనులకు వెళ్లేవారికి అనుమతి ఉందా? వైద్యంకోసం వెళ్లే రోగులకు ముందస్తు అనుమతి ఉండాలా?
వ్యవసాయ పనులకు వెళ్లేవారిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతిస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఎక్కడా ఇప్పటివరకు ఇబ్బందులు తలెత్తలేదు. దవాఖానకు వెళ్లే రోగులు వారివద్ద ఉన్న లేటెస్ట్ ప్రిస్క్రిప్షన్ చీటీలు, ఇతర రిపోర్టులు చూపించవచ్చు.
తలసేమియా రోగుల చికిత్సకు, రక్తదానం చేసేందుకు వెళ్లేవారికి అనుమతిస్తున్నారా?
తలసేమియా రోగుల చికిత్సకోసం అవసరమైన ఈపాస్లను జారీచేస్తున్నాం. రక్తదానం చేసేందుకు వెళ్లేవారికి కూడా పాస్లు ఇస్తున్నాం.
ఎమర్జెన్సీ సేవల కోసం పాస్లకు ఎలా సంప్రదించాలి?
ఎలాంటి అత్యవసర పరిస్థితి అయితే డయల్ 100కు తెలియజేయవచ్చు. అదేవిధంగా ఈపాస్ల కోసం ‘Telanganastatepolicewebsite’ లోకి వెళ్లి ఈపాస్ పోర్టల్లో వివరాలు నమోదుచేసి పాస్ పొందవచ్చు.
ఇతర రాష్ర్టాలకు వెళ్లేవారికి, ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడి వచ్చేవారి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?
మన దగ్గరి నుంచి ఎమర్జెన్సీ, ఇతర కారణాలతో బయటిరాష్ర్టాలకు వెళ్లేవారికి ఈ-పాస్లు జారీచేస్తున్నాం. అదేవిధంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారిని పాస్లు ఉంటేనే నిబంధనల మేరకు అనుమతిస్తున్నాం.
సరిహద్దుల్లో అంబులెన్స్ల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
లాక్డౌన్ను కఠినతరం చేయడంపై ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నది?
ప్రజలంతా లాక్డౌన్ను కఠినంగానే అమలుచేయాలని కోరుతున్నారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా వైరస్ వ్యాప్తిచెందుతున్నది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇందుకు పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తూ లాక్డౌన్ ముగిసేవరకు అత్యవసరమైతే మినహా ఇంటినుంచి బయటకు రావొద్దని కోరుతున్నాను.