ప్రకృతి అందాలకు, పక్షుల కిలకిలారావాలకు నిలయమైన ఈశాన్య భారతంలోని అస్సాం-మిజోరం మధ్య ఇటీవల భగ్గుమన్న సరిహద్దు వివాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 150 ఏండ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ వివాదం ఒకే దేశంలోని రెండు రాష్ర్టాలు శత్రు దేశాలుగా తలపడేలా చేయడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. అయితే, దేశంలోని దాదాపు 17 రాష్ర్టాల్లో సరిహద్దు వివాదాలు ఉన్నాయని తెలుసా? ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం…
చైనా కుతంత్రాలతో..
అస్సాంకు మిజోరంతో పాటు మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్తో గత కొన్నేండ్లుగా సరిహద్దు వివాదం నడుస్తూనే ఉన్నది. చారిత్రాత్మక విభజనేదీనికి కారణంగా చెప్పొచ్చు. 1950లో అస్సాంను రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్లు కూడా అస్సాంలో భాగంగా ఉండేవి. అయితే, అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతుండటంతో 1963లో నాగాలాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ప్రకారం అస్సాం నుంచి కొన్ని ప్రాంతాలను విడగొట్టి మణిపూర్, మేఘాలయ, త్రిపురను రాష్ర్టాలుగా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ను యూటీలుగా ఏర్పాటు చేశారు. అయితే బ్రిటీష్ ప్రెసిడెన్సీలో తమకు ఇచ్చిన ప్రాంతాలను మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో కలిపారంటూ అస్సాం ఆరోపించింది. దీంతో వివాదం తీవ్రమైంది.
వివాదాలకు గల ప్రధాన కారణాలేంటి?
బ్రిటిష్ వలసపాలనలోనే చాలావరకు రాష్ర్టాల మధ్య సరిహద్దు వివాదాలకు అంకురార్పణ జరిగింది. స్వాతంత్య్రం వచ్చాక దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకొని భాష, సంస్కృతిని బట్టి 1956లో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొన్ని ప్రాంతాలను కలుపుతూ రాష్ర్టాలను ఏర్పాటు చేశారు. అయితే, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన ప్రావిన్సుల్లోని కొన్ని ప్రాంతాలు ఇతర కొత్త రాష్ర్టాల పరిధిలోకి రావడంతో సరిహద్దుల వివాదం ముదిందని చెప్పొచ్చు.
స్థానిక భాష కారణాన్ని చూపుతూ 7 రాష్ర్టాల పితలాటకం పర్యాటకం కోసమే
కేంద్రపాలిత ప్రాంతం లఢక్లోని సర్చూ ప్రాంతం సుందరమైన పర్వతాలకు నిలయం. ఈ ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపాలని హిమాచల్ ప్రదేశ్ వాదిస్తున్నది. దీనికి కారణం పర్యాటక రాబడే. సర్చూకి రోజూ వందలాది మంది ట్రెక్కర్లు వస్తుంటారు. ఇందులో 85 శాతం మంది హిమాచల్కు చెందినవారే. దీంతో తమ పర్యాటకులతోనే లఢక్ యంత్రాంగానికి ఆదాయం వస్తున్నదని, కాబట్టి ఆ ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపాలని హిమాచల్ వాదిస్తున్నది. అలాగే హర్యానా, హిమాచల్ మధ్యనున్న అటవీ ప్రాంత సరిహద్దుల అంశంలో కూడా వివాదం నడుస్తున్నది.
ప్రకృతి చేసిన పని వల్ల..
ఉత్తరప్రదేశ్కు బీహార్తో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వర్షాకాలంలో హిమానీనదులు ఉప్పొంగి ప్రవహించడంతో వాటి ప్రవాహ మార్గాలు మారుతూ ఉంటాయి. దీంతో సరిహద్దుల్లో అధికారికంగా గుర్తించిన కొన్ని గ్రామాలు ఆయా సమయాల్లో నదులకు మరోపక్క రావడం జరుగుతున్నది. ఇదే వివాదానికి కారణమవుతున్నది. మరోవైపు, హర్యానా, యూపీలోని కొన్ని గ్రామాల రైతుల భూముల అంశంలో సరిహద్దుల వివాదాలు ఉన్నాయి.
శాటిలైట్తో సరిహద్దుల నిర్ణయం
సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఉపగ్రహ ఛాయాచిత్రాల (శాటిలైట్ ఇమేజింగ్) ద్వారా ఈశాన్య రాష్ర్టాల సరిహద్దులను నిర్ణయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అస్సాం-మిజోరం మధ్య ఇటీవల తలెత్తిన సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అస్సాంతో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని మిజోరం సీఎం జొరాంథాంగా అన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకుంటామని మిజోరం ప్రభుత్వం వెల్లడించింది. చర్చల ద్వారానే సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయని బిశ్వశర్మ అన్నారు. అస్సాం-మిజోరం సీఎంలతో కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదివారం ఫోన్లో మాట్లాడారు. గతవారం జరిగిన హింసాత్మక ఘటనలపై సీబీఐతో విచారణ చేపట్టే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భాషతోనే గొడవంతా
-మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా కర్ణాటకలోని బెళగావి, బీదర్, గుల్బర్గా, ఉత్తర కన్నడలో ఉన్నారని, కాబట్టి ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తున్నది. దీన్ని కర్ణాటక వ్యతిరేకిస్తున్నది. స్వాతంత్య్రానికి ముందు దాదాపు ఈ ప్రాంతాలన్నీ బాంబే ప్రెసిడెన్సీ కిందనే ఉండటం గమనార్హం.
-కేరళలోని కాసర్గోడ్లో ఎక్కువగా కన్నడ భాషను మాట్లాడుతారని, దీంతో ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలుపాలని ఆ రాష్ట్ర డిమాండ్. దీనిపై ఆందోళనలు ఉద్ధృతమవ్వడంతో గతేడాది కొన్ని రోజులపాటు కేరళ సరిహద్దులను మూసివేసింది.
-ఒడిశాలోని 63 గ్రామాల్లోని ప్రజలు తెలుగు మాట్లాడుతారని, ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలుపాలని ఆ రాష్ట్రం వాదిస్తున్నది.
-జార్ఖండ్లోని సెరైకెలా, ఖర్సావన్లో ఒడియా మాట్లాడుతారని, వాటిని తమ రాష్ట్రంలో కలుపాలని ఒడిశా డిమాండ్.
-ఒడిశాలోని బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లోని కొన్నిగ్రామాల్లో బెంగాలీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారంటున్న పశ్చిమబెంగాల్.. ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపాలంటున్నది.