న్యూఢిల్లీ, మే 22: యువత, నడివయస్సువారిపై కరోనా పంజా విసురుతున్నది. సెకండ్వేవ్లో ఏప్రిల్, మే నెలల్లో 50 ఏండ్ల లోపు వారు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి కొవిడ్తో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య పెరిగిందని, అలాగే ఐసీయూలో చేరుతున్నవారి సగటు వయసూ తక్కువగా ఉంటున్నదని వైద్యులు చెబుతున్నారు. ‘సెకండ్వేవ్లో యువతీ యువకులు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. 60-70 శాతం వరకు 60 ఏండ్లలోపు వారే ఉంటున్నారు. ఇందులోనూ సగానికిపైగా 45 ఏండ్లలోపువారే’ అని ప్రముఖ వైద్యులు రేష్మా తివారీ తెలిపారు.
ముప్పునకు మూడు కారణాలు
తమిళనాడు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని 45 ఏండ్లలోపువారు అధికసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. ఇందుకు ప్రధానంగా వైద్యులు 3 కారణాలను చెబుతున్నారు. ఒకటి హ్యాపీ హైపోక్సియా. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు భారీగా తగ్గినా యువతలో ముందస్తు లక్షణాలు కనిపించడం లేదు. తీరా ఆరోగ్యం విషమించాక దవాఖానలో చేరడం వల్ల అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతున్నదని వైద్యులు చెబుతున్నారు. రెండోది, యువత ఎక్కువగా బయట తిరగడంతోపాటు వ్యాక్సిన్ తీసుకోకపోవడం. దీనివల్ల వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటున్నదని పేర్కొంటున్నారు. మూడో కారణం.. వైరస్ ఉత్పరివర్తనం చెందడం. ఇది వేగంగా వ్యాపించడంతోపాటు యువతకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నదని మేదాంత దవాఖాన వైద్యులు సుశీల కటారియా తెలిపారు.