ప్రత్యేక ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం తెలంగాణలో మూడు రకాల కరోనా వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. కానీ వాటిలో అత్యంత ప్రమాదకరమైన మ్యుటేషన్లు లేవని తేలింది. గతంలో ఉన్న వేరియంట్ల కంటే ఇవి నాలుగు నుంచి పది రెట్లవరకు వేగంగా వైరస్ను వ్యాప్తి చేస్తున్నాయని గుర్తించింది. అయితే ఈ వేరియంట్ల గొలుసుకట్టును తెంపకపోతే మరిన్ని కొత్త ఉత్పరివర్తనాలు త్వరలోనే వృద్ధి చెందే ఆస్కారమున్నదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అవి మరింత బలంగా మారి మరణాల రేటును పెంచే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కరోనా వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, గత నెల వరకు మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన డబుల్ మ్యుటేటెడ్ వైరస్ చాలా బలంగా ప్రబలుతున్నదని గుర్తించారు. ప్రస్తుతం డబుల్ మ్యుటెంట్లో బీ 1.617 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఎల్ 452ఆర్, ఈ 484క్యూ రెండు భిన్న వైరస్ రకాల కలయికతో కొత్త స్ట్రెయిన్ ఏర్పడిందని ఇటీవలి పరిశీలనలో తేల్చారు. వాటిలో రెండు భిన్న రకాల వేరియంట్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం బీ 617 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఈ మధ్య కాలంలో బీ 618 రకం కనుగొన్నప్పటికీ అది ప్రస్తుతం ఉనికిని కోల్పోయిందని, ప్రస్తుతం తెలంగాణలో యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్తోపాటు బీ 1.617.1, బీ 1.617.2, బీ 1.617.3 వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వివరించారు.
ఎక్కువ ప్రమాదం కలిగిన యూకే స్ట్రెయిన్ ‘ఇ484కె’ కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇవి మరీ ప్రమాదకరంగా పరివర్తనం చెందలేదని, కానీ వాటి వ్యాప్తి తీవ్రంగా ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాది జూన్లో కనుగొన్న కొత్త వేరియంట్ ఎన్ 440కే (బీ 1.36) దాదాపు ఉనికిని కోల్పోయినట్టు గుర్తించారు. బలహీన కోరలు కలిగిన ఆ వేరియంట్ మార్చి నెల వరకు దాదాపు ఉనికిలో లేనట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా ఉన్నదని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) సహకారంతో సీసీఎంబీ సార్స్-కొవిడ్-2 పై విస్తృతంగా జీనోమ్ సీక్వెన్సీ పరిశోధనలు జరుపుతూ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ల ఉనికిని కనుగొంటున్నది.
చైన్ లింక్ తెంపకుంటే ప్రమాదం ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న
వైరస్ల గొలుసుకట్టు ( చైన్ లింక్) తెంపడానికి కఠిన చర్యలు తీసుకోకపోతే మరో మహా ముప్పు తప్పదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. ఈ వైరస్లు ఎంత ఎక్కువ మందికి ప్రబలితే అంత ఎక్కువ పరివర్తనం చెందుతాయని వివరించారు. అవి పరివర్తనం చెందిన కొద్దీ బలపడుతాయని, అప్పుడు మరణాల రేటు పెరిగే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉనికిలో ఉన్న వేరియంట్లు మరీ ప్రమాదకరంగా కనిపించడం లేదని, కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అవి రూపాంతరం చెందే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.