న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో ఈ నెల నుంచే కరోనా థర్డ్వేవ్ (మూడో ఉద్ధృతి) ప్రారంభమయ్యే అవకాశమున్నదని పరిశోధకులు తెలిపారు. అక్టోబర్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా లక్షన్నర వరకు నమోదవ్వచ్చని అంచనా వేశారు. అయితే, సెకండ్వేవ్తో పోలిస్తే, థర్డ్వేవ్ తీవ్రత తక్కువేనని తెలిపారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్, ఐఐటీ కాన్పూర్కు చెందిన మణీంద్ర అగర్వాల్ మ్యాథమెటికల్ మోడల్ను రూపొందించారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కేరళ, మహారాష్ట్ర.. పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదమున్నదన్నారు. ఆంక్షల సడలింపులు, డెల్టా వేరియంట్ విజృంభణ కేసుల పెరుగుదలకు కారణమని అభిప్రాయపడ్డారు. కాగా, దేశంలో సెకండ్వేవ్ సరళి, తీవ్రతపై గతంలో ఈ బృందం వేసిన అంచనాలు నిజమయ్యాయి.
కొత్త వేరియంట్లపై అప్రమత్తత అవసరం
థర్డ్వేవ్ విరుచుకుపడనున్న నేపథ్యంలో పరిశోధకులు కొన్ని కీలక సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కేసులు పెరుగుతున్న హాట్స్పాట్లలో నిఘాను పెంచి, వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు కొనసాగించాలని సూచించారు. కొత్త వేరియంట్లు వెలుగుచూసే ప్రమాదమున్న నేపథ్యంలో వైరస్ జన్యుక్రమ విశ్లేషణలపై దృష్టిసారించాలని పేర్కొన్నారు.
ఎస్బీఐ, ఐసీఎంఆర్ కూడా అదే చెప్పింది
దేశంలో థర్డ్వేవ్ ఆగస్టులో ప్రారంభంకావచ్చని గతనెలలో ఎస్బీఐ ఒక నివేదికలో అంచనా వేసింది. సెప్టెంబర్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయన్నది. ఆగస్టు చివరినాటికి దేశంలో థర్డ్వేవ్ ప్రారంభంకావచ్చని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమీరన్ పాండా అంచనా వేశారు. రోజుకు లక్ష చొప్పున కేసులు నమోదుకావచ్చన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 40 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సగం కేసులు కేరళలోనే రికార్డవుతున్నాయి. దీంతో కొవిడ్-19 వ్యాప్తికి ఈ ప్రాంతం హాట్స్పాట్గా మారొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకూ 47 కోట్ల టీకా డోసులిచ్చారు. అయితే, 7.6 శాతం మంది మాత్రమే రెండు డోసులు వేసుకున్నారు.