న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దివ్యాంగులతో పాటు వయోభారం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ఇండ్ల నుంచి బయటకు రాలేనివారికి ఇంటివద్దనే కొవిడ్ టీకాలను వేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఇంకా కరోనా సెకండ్వేవ్ మధ్యలోనే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. దేశంలోని కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం మీడియాతో మాట్లాడారు. గతవారం దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 62.73 శాతం కేసులు ఒక్క కేరళలోనే రికార్డయినట్టు అధికారులు పేర్కొన్నారు. లక్షకు పైగా క్రియాశీల కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నట్టు చెప్పారు. దేశంలోని 33 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉండగా, 23 జిల్లాల్లో ఇది 5-10 శాతంగా ఉన్నట్టు వెల్లడించారు.
మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఎదురయ్యే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. కరోనా చికిత్సలో భాగంగా కొందరు స్టెరాయిడ్లను వినియోగించారని, దీంతో కొత్తగా ఫంగస్ వంటి వ్యాధులు వ్యాపించాయని గుర్తు చేశారు. ప్రతికూల ప్రభావంలేని కొవిడ్ చికిత్సను వైద్య సిబ్బంది రోగులకు అందజేయాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో మానసిక ైస్థెర్యాన్ని నింపాలన్నారు. తాజా నిబంధనలు బాధితులకు చికిత్సనందించే వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పండుగల సమయాల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు
రానున్న పండుగల సమయాల్లో ప్రజలు పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు.
కంటైన్మెంట్ జోన్లు, పాజిటివిటీ రేటు 5% కంటే ఎక్కువ ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమిగూడవద్దు.
ప్రజల సమూహాలపై అధికారులు పర్యవేక్షణ ఉంచాలి. దీనికి సీసీటీవీలను ఉపయోగించుకోవచ్చు. మాస్కులు లేనివారు, భౌతిక దూరం పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పాజిటివిటీ రేటు 5 శాతం, అంతకంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో పరిమిత సంఖ్యలో సమూహంగా పండుగలు నిర్వహించుకోవాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
స్థానికంగా కరోనా నిబంధనల్ని సడలించేందుకు ఆ ప్రాంతంలో వీక్లీ పాజిటివిటీ రేటు, దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్, ఐసీయూలో బెడ్ల లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి.
వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ‘టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీటింగ్-వ్యాక్సినేషన్-కొవిడ్ రూల్స్’ను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలి. అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలను విధించవచ్చు.
బ్రిటన్ క్వారంటైన్ నిబంధనలపై చర్చలు
కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ, బ్రిటన్కు వచ్చే భారతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాలన్న ఆ దేశ నిబంధనలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ ఇది వివక్షాపూరిత చర్యేనన్నారు. బ్రిటన్ తాజా నిబంధనలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని రాజేశ్ భూషణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ వెనక్కితగ్గకుంటే అదేస్థాయిలో ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు..
దేశంలో వ్యాక్సినేషన్ తీరు ఇలా..
ఒక్క డోసు వేసుకున్నవారు 66%
రెండు డోసులు వేసుకున్నవారు 23%
ఇప్పటివరకూ వేసిన వ్యాక్సిన్ డోసులు 84 కోట్లు
టీకా వేసుకున్న పురుషులు 43.39 కోట్లు
టీకా వేసుకున్న మహిళలు 39.72 కోట్లు
టీకా వేసుకున్న ఇతరులు 16.61 లక్షలు
ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేసుకున్నవారు- 6 శాతం ప్రభుత్వ కేంద్రాల్లో టీకా వేసుకున్నవారు-94 శాతం