హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రజలకు ‘ఉపాధి’ హామీ ఇస్తున్నది. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లినవారికి పని చూపుతూ భరోసా కల్పిస్తున్నది. ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల్లో 31 వేల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి హామీ జాబ్కార్డులను కొత్తగా జారీచేసింది. ఒక్కో జాబ్కార్డుపై ఆ కుటుంబంలో 18 ఏండ్లు నిండినవారందరూ పనిచేయవచ్చు. గత సంవత్సరం లాక్డౌన్ సందర్భంగా లక్షల మంది గ్రామాలకు వెళ్లారు. ఆ సమయంలో 3.50 లక్షల కొత్త జాబ్కార్డులు జారీచేశారు. ఈసారి ఏప్రిల్, మే నెలల్లోనే 31వేల కొత్త కార్డులను జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి లక్షకుపైగానే అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో స్వయం ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు, అడ్డ్డా కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొనేవారికి ఉపాధి కరువైంది. ఈ నేపథ్యంలో లక్షల మంది సొంత గ్రామాలకు పయనమయ్యారు. వారంతా అక్కడ ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రామాలకు చేరిన అందరికీ జాబ్కార్డులు అందజేస్తూ ప్రభుత్వం వారికి ఉపాధి హామీ కల్పిస్తున్నది.
ఎంతమంది వచ్చినా..
పట్టణాల నుంచి ఎంతమంది గ్రామాలకు వచ్చినా ఉపాధి కల్పించేందుకు వెంటనే జాబ్కార్డులు జారీచేయాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రామ కార్యదర్శులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. జూన్ మొదటి వారం తర్వాత వ్యవసాయ పనులు మొదలవుతాయి. అప్పటికల్లా అత్యధిక కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కింద పంట కాలువలు సరిచేయడం, ఫీల్డ్ చానల్స్ పూడికతీయడం తదితర పనులు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం 13 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏప్రిల్, మే రెండు నెలల్లోనే దాదాపుగా 6 కోట్లకు పైగా పనిదినాలను కల్పించారు. సగటున రోజుకు దాదాపుగా 18 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పనులకు వస్తున్నారు. 13 వేల కుటుంబాలకు ఇప్పటికే వంద రోజులకు పైగా పనిదినాలను కల్పించారు. వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది.