సంగారెడ్డి, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేత తకళ్లపల్లి సత్యనారాయణరావుతో పాటు జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి హైదరాబాద్లో హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
సదాశివపేటలో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. నాడు తెలంగాణకు వంద కోట్ల మంది ఒప్పుకోవాలని, తాను బతికుండగా తెలంగాణ రాదని వైఎస్ వెటకారాలు చేశారని, అలాంటివారి వారసులను ఎందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. ‘మా నీళ్లు దోచుకున్నందుకా? మా నిధులు ఆంధ్రాకు మళ్లించినందుకా? తెలంగాణను అవహేళన చేసినందుకా?’ అని నిలదీశారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను అవమానపర్చి, అవహేళన చేసి, తెలంగాణ రాకుండా అడ్డుకున్న వ్యక్తులకు ఇంకా తాము వారసులం అంటూ వచ్చేవారిని ఈ గడ్డ సహించబోదని హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు, జయశంకర్సార్ సాగించిన పోరాటాలు, కేసీఆర్ 11రోజులపాటు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్కు తప్ప మరెవ్వరికీ స్థానం లేదని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లోనే..
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో తప్ప ప్రజల్లో ఉండరని, అధికారంపై పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడితే, గొంతునొక్కి అసెంబ్లీ నుంచి బయటకు పంపింది వైఎస్ కాదా? అని నిలదీశారు. తాము తెలంగాణ కోసం, నీళ్లు, నిధుల కోసం అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడితే, కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ కలిసి రాలేదని దుయ్యబట్టారు. తామే తెలంగాణ తెచ్చామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. వైఎస్, కిరణ్కుమార్రెడ్డి, హైకమాండ్ మెప్పుకోసమే కాంగ్రెస్ నాయకులు కొట్లాడారు తప్ప తెలంగాణ ప్రజల పక్షాన కాదని విమర్శించారు.
చంద్రబాబును తరిమికొట్టారు
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబును ప్రజలు కోదాడ వరకు తరిమికొట్టారని మంత్రి హరీశ్ అన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ముసుగులో, ఇంకో ముసుగులో ఆంధ్రతొత్తుల అడుగులకు మడుగులొత్తే నాయకులకు తెలంగాణలో స్థానంలో లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో నీతి, నిజాయతీకే స్థానం ఉంటుందని తెలిపారు. తుపాకులకు పట్టుకుని సంచరించిందెవరో, సంగారెడ్డిని బీదర్లో కలపమన్నదెవరో, సమైక్య ఏపీ ముద్దు.. తెలంగాణ వద్దు అన్నదెవరో తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
కాంగ్రెస్ పగటికలలు
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ నాయకులు అధికారంపై పగటి కలలు కంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. వాళ్లు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించటం లేదన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు తప్ప ఏమీ చూడలేదని చెప్పారు. ‘కాంగ్రెస్ హయాంలో రైతుల నుంచి పంటలు కొనలేదు. నీళ్లు ఇవ్వలేదు. యూరియా ఇవ్వలేదు. కరెంటు సరఫరా చేయలేదు.. అలాంటివారికి ఏమి సాధించారని అధికారమివ్వాలి?’ అని ప్రశ్నించారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సాధించారని వివరించారు. కాంగ్రెస్ హయాంలో సర్కారు దవాఖానలను భ్రష్టుపట్టిస్తే, సీఎం కేసీఆర్ వాటిని పూర్తిస్థాయిలో ఆధునీకరించారని వివరించారు.
దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారని మంత్రి హరీశ్రావు వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, 24గంటల విద్యుత్ సరఫరా, శాంతిభద్రతలు చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని చెప్పారు. త్వరలో జహీరాబాద్ నిమ్జ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల కోట్లతో విద్యారంగాన్ని బలోపేతం చేసి, అన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. సీఎం కేసీఆర్పై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎమ్మెస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ, వైస్ చైర్మన్ గోపాల్, టీఆర్ఎస్ నాయకులు మనోహర్గౌడ్, బొంగుల రవి, డాక్టర్ శ్రీహరి, ప్రభుగౌడ్, విజయేందర్రెడ్డి, మల్లాగౌడ్, నక్క నాగరాజు, చిల్వెర ప్రభాకర్, కొండల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, సత్యనారాయణ, రషీద్, పాండు, చీల మల్లన్న, చిన్నా, సుధీర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, ఎంపీపీలు సరళపుల్లారెడ్డి, మనోజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్
హైదరాబాద్: హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగేవారు కాదని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులకే పట్టం కడతారని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేత తకళ్లపల్లి సత్యనారాయణరావుతో పాటు జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి టీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్రావు గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు హుజురాబాద్ ఏఎంసీ డైరెక్టర్ గూడూరు మహేందర్రెడ్డి, మరికొందరు టీఆర్ఎస్లో చేరారు. వారిని మంత్రి హరీశ్రావు అభినందించారు.