సిద్దిపేట, ఆగస్టు 5: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్లు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాం గ్రెస్, బీజేపీ నాయకులు సిద్దిపేటలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళిత అభ్యర్థులను బరిలోకి దింపితే దళిత ఓట్లు చీల్చవచ్చనే దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సైతం ఇతర దళిత నాయకులను హు జూరాబాద్లో పోటీ చేయించాలని చూస్తున్నారని, దీనివల్ల ఈటల రాజేందర్కు అనుకూలంగా మారుతుందనే భ్రమలో ఉన్నారన్నారు.
దళితబంధు పథకంతో దళితులంతా టీఆర్ఎస్ వైపే నిలవడం ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్రలు, కుమ్మక్కులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోదీ ఫొటో, బీజేపీ జెండాతో పోతే ఓట్లు రావనే భయంతో తన ఫొటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఈటల రాజేందర్ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. మోదీ అవలంబిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే బలహీనంగా మారిందని, అందుకే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీని బండకేసి కొట్టారని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని, అదే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి నాగరాజుతోపాటు 50 మంది యువకులు, చిన్నపాపాయ్పల్లి నుంచి బీజేపీ వార్డు సభ్యులు తనుగుల అంజలి సునిల్, శ్రీనివాస్, తిరుపతి, యువమోర్ఛా నాయకులు ప్రవీణ్, చందర్, దేవరాజు, ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్రెడ్డి, ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి సర్పంచ్ సరోజన నాగన్న, బోగంపాడ్ సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి, మాదన్నపేట గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన యువకులు, బీజేపీ, కాంగ్రె స్, టీడీపీ నాయకులు 500 మంది ఎమ్మెల్యే సతీశ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన ఆటో యూనియన్ సభ్యులు 300 మంది ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో, వీణవంక మండలం దేశాయిపల్లి ఎస్సీ కాలనీలో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 40 మంది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.