ప్రతి రోజూ కరోనా టెస్టులు..
కఠినమైన కొవిడ్ నిబంధనలు..
కొత్త ప్రపంచ రికార్డులు..
సరికొత్త వ్యక్తిగత ప్రదర్శనలు..
అభిమానులను ఉర్రూతలూగించిన క్షణాలు..
అథ్లెట్లను కంటతడి పెట్టించిన భావోద్వేగాలు..
ఇలా 17 రోజుల పాటు యావత్ ప్రపంచాన్ని సంబురాల్లో ముంచెత్తిన క్రీడా పండుగ ముగిసింది. విపత్కర పరిస్థితుల్లో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్ దిగ్విజయంగా ముగిశాయి. జపాన్ రాజధానిలో ఎందరో కొత్త హీరోలు పుట్టుకు రాగా.. మరెందరో స్టార్ అథ్లెట్లు తెరమరుగయ్యారు. ‘కష్టకాలాన్ని దాటి ముందుకు సాగుదాం’అనే సందేశంతో ఆదివారం పరిమిత అతిథుల మధ్య జపాన్ యువరాజు అకిషినో ఆటలకు ముగింపు పలుకగా.. ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఒలింపిక్ పతాకాన్ని పారిస్ మేయర్ చేతిలో పెట్టాడు. మరో మూడేండ్ల తర్వాత జరుగనున్న 33వ ఒలింపిక్స్కు ఈఫిల్ టవర్ ఇప్పటి నుంచే రా రమ్మని పిలుస్తున్నది!
టోక్యో: విశ్వక్రీడల చరిత్రలోనే ఎంతో ప్రత్యేకమైన టోక్యో ఒలింపిక్స్కు నిర్వాహకులు ఘనమైన ముగింపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్కు.. ఆదివారం తమదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆట పాటలతో సాగిన ముగింపు వేడుకలో పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడు గంటల పాటు సాగిన ముగింపు వేడుకలో భారత్ తరఫున స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా పతాకాధారిగా ముందు నడిచాడు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. సడలని సంకల్పంతో ముందుకు సాగిన నిర్వాహకులు ఆదివారం మరోసారి కొవిడ్ మృతులకు నివాళులర్పించారు. ఆరంభ ఒలింపిక్ జెండాను పారిస్ మేయర్ అన్నె హిడాల్గో చేతికివ్వడంతో టోక్యో విశ్వక్రీడలు ముగియగా.. అక్కడ పారిస్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. 2024లో జరుగనున్న మెగాటోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న ఫ్రాన్స్ ఆదివారమే రిహార్సల్స్ మొదలుపెట్టింది. భారీ జనసందోహం మధ్య ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ విమానాలు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి.
జిల్ జిల్ జిగేల్..
ఆరంభ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన అథ్లెట్లు.. పోటీలు పూర్తికావడంతో ముగింపు వేడుకల్లో తమ కిష్టమైన వేశభాషల్లో సందడి చేశారు. అథ్లెట్లు ఒక్కొక్కరుగా మైదానం చుట్టూ చేరగా.. మధ్యలో ఏర్పాటు చేసిన భారీ స్టేజ్పై సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. బాణాసంచా వెలుగుల్లో ఒలింపిక్ స్టేడియం తళుకులీనగా.. టోక్యో వినీల ఆకాశం కొత్త రంగులు అద్దుకుంది. ఈ క్రీడల్లో 39 స్వర్ణా లతో సహా 113 పతకాలు కొల్లగొట్టిన అమెరికా.. పట్టిక టాప్లో నిలువగా.. చైనా (88), జపాన్ (58) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విశ్వక్రీడల చరిత్రలో భారీ బృందం (127 మంది అథ్లెట్లు)తో బరిలోకి దిగిన భారత్.. ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో 48వ స్థానంతో మెగాటోర్నీని ముగించింది. ‘మహమ్మారి ప్రభావం ప్రారంభమయ్యాక విశ్వమంతా ఏకమైన అతిపెద్ద సందర్భమిదే’అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాల సందర్భంగా ఒలింపిక్ జెండాను పారిస్కు అప్పగించే సమయంలో ఆ దేశ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఇలా చేయడం చరిత్రలో తొలిసారి. నేషనల్ ఆర్కెస్ట్రా ఆఫ్ ఫ్రాన్స్ ఈ ప్రదర్శనను నిర్వహించింది. ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెస్క్యూట్ స్పేస్ నుంచి జాతీయ గీతాన్ని ఆలపించారు.
భవిష్యత్తుపై భరోసా ఇచ్చాయి
మీ క్రీడలతో మాలో స్ఫూర్తి నింపారు. అంతేగాక కరోనా వైరస్ సమయంలో మీరు వీటిని ఎదుర్కోవడం మరింత విశేషం. మహమ్మారి తర్వాత ప్రపంచమంతా తొలిసారి ఒక్కచోటుకు చేరింది. ఇది మాకు నమ్మకాన్ని కల్పిస్తున్నది. టోక్యోలో నిర్వహించిన ఒలింపిక్స్ మాకు భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచాయి. మీరు (జపనీయులను ఉద్దేశిస్తూ) సాధించిన దానిపై గర్వంగా ఉంది. అథ్లెట్లందరి తరఫున మీకు కృతజ్ఞతలు. థాంక్యూ టోక్యో.. థాంక్యూ జపాన్.
థామస్ బాచ్, ఐవోసీ అధ్యక్షుడు
టోక్యో విశ్వ క్రీడల్లో 205 దేశాలు (ఒక శరణార్థి జట్టు) పాల్గొనగా 93 దేశాలు ఏదో ఒక పతకం సాధించిన దేశాలుగా నిలిచాయి. మిగిలిన దేశాలు ఒలింపిక్ పోడియంపై నిలిచే అదృష్టం దక్కించుకోలేకపోయాయి.
ఈ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్ కియోన్ అత్యధిక పతకాలు(7) గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్యాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.