హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతులమీదుగా ఊపిరిపోసుకున్న టీఆర్ఎస్ కార్యాలయానికి గురువారం ఢిల్లీలో జరిగిన భూమిపూజ రెండు దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో చారిత్రక సన్నివేశమని అభివర్ణించారు. భూమిపూజ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్ ఎన్నో సవాళ్లను ఎదురొన్నదన్నారు.
తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల నుంచి, జలదృశ్యం సాక్షిగా పార్టీ ఆఫీసును రోడ్డున పడేసిన చంద్రబాబు కక్షపూరిత చర్యల నుంచి, స్వరాష్ట్ర కాంక్షను చిదిమేయాలని చూసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన నుంచి ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిందని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభాలను ఎదురొంటూ.. అనేక చికుముళ్లను విప్పుకొంటూ వెళ్లిందని చెప్పారు. ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలో సజీవంగా ఉంచుతూనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పవర్ కారిడార్లలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు విస్తృత మద్దతు కూడగట్టారని గుర్తుచేశారు. తొలి అడుగునే త్యాగంతో మొదలుపెట్టిన కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు అనేకసార్లు పదవులను పూచికపుల్లలా విడిచిపెట్టారని అన్నారు. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజే పీ తెలంగాణ అంశంపై ఎన్ని దాగుడుమూతలు ఆడినా, కేసీఆర్ మడమ తిప్పకుండా ఉద్యమాన్ని కొనసాగించారని.. ప్రాణాలను పణంగా పెట్టి, చివరకు ఢిల్లీ మెడలువంచి ఆరు దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు.
ఏండేండ్ల స్వరాష్ట్ర పాలనలో..
ఏడేండ్ల స్వయంపాలనలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అప్రతిహతంగా పురోగమిస్తున్నదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భాష, సంసృతులకు పెద్దపీట వేస్తూనే ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి ఒక మహత్తరమైన పునర్నిర్మాణ దిశగా దిగ్విజయంగా కొనసాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమం, ఆ తర్వాత మొత్తం రెండు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పర్యాయపదంగా టీఆర్ఎస్ నిలిచిందంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు.
అంబురాన్నంటిన సంబురం
దేశ రాజధానిలో టీఆర్ఎస్ సొంత కార్యాలయం భూమిపూజ వేడుక తెలంగాణ నుంచి వచ్చిన వందల మంది నాయకులు, కార్యకర్తల నడుమ పండుగలా జరిగిందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో నిర్వహించిన కారు ర్యాలీ మొదలుకొని తెలంగాణ ఏర్పాటు కోసం నిరంతరం ఢిల్లీకి చేసిన అనేక ప్రయాణాలను ఉద్వేగంతో స్మరించుకున్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వీయరాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ సర్ మాటలాగా.. ఇవ్వాళ తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీగడ్డ మీద రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డకు గొప్ప భరోసాను ఇస్తున్నదని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రాంతీయపార్టీ ఢిల్లీలో కార్యాలయాన్ని స్థాపించడం రెండోది కావడం టీఆర్ఎస్ శ్రేణులకు గర్వకారణని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకూ, నాయకులకూ, కార్యకర్తలకూ శుభాకాంక్షలు తెలియజేశారు.