హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొలువుల భర్తీకి మార్గం సుగమమైంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ గురువారం నుంచి అమల్లోకి వస్తున్నది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 16న కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఉత్తర్వులను అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 2018లో ఏర్పడిన ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్కు, నారాయణపేట జిల్లాను జోగులాంబ గద్వాల జోన్కు కేటాయించారు. జోగులాంబ జోన్లోఉన్న వికారాబాద్ జిల్లాను స్థానికుల కోరిక మేరకు చార్మినార్ జోన్లో కలిపారు. కొత్తగా అమల్లోకి వచ్చిన సవరణ ఉత్తర్వుల ప్రకారం త్వరలో క్యాడర్ వర్గీకరణ చేపడతారు. జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి క్యాడర్లను నిర్వచిస్తారు. ఆ ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ను నిర్ణయిస్తారు. అనంతరం ఖాళీలను గుర్తించి ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పాత వ్యవస్థలో సీమాంధ్రులకే ప్రయోజనం
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల కోసం జోనల్ వ్యవస్థను తెచ్చినా ఇక్కడి నిరుద్యోగులకు న్యాయం జరిగేది కాదు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని 5, 6 జోన్ల కింద విభజించారు. ఆరోజోన్లో ఉన్న హైదరాబాద్ను ఫ్రీజోన్గా మార్చడంతో సీమాంధ్రులే ఎక్కువగా తిష్ఠవేసేవారు. ఓపెన్ కోటా జిల్లా క్యాడర్ పోస్టులకు 20%, గ్రూప్-2 పోస్టులకు 30%, గ్రూప్-1 పోస్టులకు 40% ఏర్పాటు చేసి, ఇందులో స్థానికేతరులకు దరఖాస్తుకు అవకాశమివ్వడంతో సీమాంధ్రులు పాగా వేశారు. దీంతో మా ఉద్యోగాలు మాకే కా వాలంటూ తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించింది. స్వరాష్ర్టాన్ని సాధించుకున్నది. స్వరాష్ట్రంలో ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే చెందేలా 95% లోకల్ కోటా నిర్ణయిస్తూ రా ష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు తీసుకొచ్చింది.
ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జోనల్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీకి ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ జరుగలేదు. పాతజోనల్ విధానంలోనే ఒకసారి గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ జరిగింది. 2018లో రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం గ్రూప్-1 ఉద్యోగాలు కూడా మల్టీజోనల్లోకి వచ్చాయి. అయితే ఆ ఉత్తర్వు ల్లో 31 జిల్లాలనే చేర్చారు. కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు, వికారాబాద్ ప్రజలు త మ జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లో కలుపాలని విన్నవించడంతో ప్రతిపాదనలను మార్చి మరోసారి రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. దీంతో ఉపాధ్యాయ భర్తీలకు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వివిధ కారణాలతో ఆగిపోయాయి. తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులతో తిరిగి గ్రూప్-1తోపాటు అన్ని గ్రూప్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు అధికారులు శాఖలవారీగా సర్వీస్ రూల్స్ రూపొందించుకొని ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడింది.
క్యాడర్ స్ట్రెంత్ వర్గీకరణ
ఉద్యోగ నియామకాలు జరగాలన్నా, పదోన్నతులు లభించాలన్నా క్యాడర్ స్ట్రెంత్ కీలకం. ఇప్పటివరకు పాత పద్ధతిలోనే అర్హులైనవారికి పదోన్నతులు కల్పించారు. జిల్లాలవారీగా క్యాడర్ స్ట్రెంత్ వర్గీకరణ జరుగలేదు. కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి రావడంతో జిల్లాలవారీగా క్యాడర్ స్ట్రెంత్ను నిర్ణయించనున్నారు. దీంతోపాటుగానే జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ స్ట్రెంత్ను కూడా వర్గీకరిస్తారు. రాష్ట్రస్థాయి పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులను వర్గీకరించనున్నారు. ఏ జిల్లాకు ఎన్నిపోస్టు లు, ఏ జోనల్కు ఎన్ని పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులేమిటి, రాష్ట్రస్థాయి పోస్టులేమిటనే దానిపై స్పష్టతనిస్తారు. దీంతో నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చాలా సులభతరమవుతుంది. అన్ని జిల్లాలవారికీ సమన్యాయం జరుగుతుంది. క్యాడర్ వర్గీకరణకు సంబంధించి కూడా అతిత్వరలో ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. దీనిఆధారంగా ఖాళీలను గుర్తించి భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తారు.
తెలంగాణ బిడ్డలకే కొలువులు
కొత్త జోనల్ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే చెందుతాయి. స్థానిక ఉద్యోగాలకు ఎసరు పెట్టిన స్థానికేతరులకు చెక్ పడుతుంది. గ్రూప్-1 పోస్టులను కూడా మల్టీ జోనల్ పద్ధతిలోనే భర్తీచేస్తారు. రాష్ట్రస్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా చేపడతారు. దీంతో నేరుగా నియమించే అధికారుల పోస్టుల్లో వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థులకు అవకాశం కలుగుతుంది. నియామకాలన్నీ జిల్లా, జోనల్, మ ల్టీ జోనల్ పద్ధతుల్లో జరుగుతాయి. ఇం దులో లోకల్ రిజర్వేషన్ 95%, ఓపెన్ కోటా 5% ఉన్నది.
ఏడు జోన్లు.. రెండు మల్టీజోన్లు
ప్రజల వద్దకే పాలన చేరాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారు. దీంతో మొదట 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ప్రకటించారు. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు ముందుగా 31 జిల్లాలకే వచ్చాయి. కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలను కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరచాలని.. ఆ మేరకు సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దాదాపు ఏడాదికిపైగా నాన్చిన కేంద్రం తాజాగా సవరణలు చేస్తూ 33 జిల్లాలకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు ఏర్పాటయ్యాయి.