నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 26: నైజాం కిరాయి సైనికులను ఒట్టిచేతులతో ఎదిరించి తరిమికొట్టిన తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల్లో మంత్రు లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పెత్తందార్ల దురాగతాలను ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం భూపాల్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుక నిర్వహించారు. ఎంపీ బీబీ పాటిల్, రెసిడెంట్ కమిషన్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. బీసీ కమిషన్ సభ్యులు కే కిశోర్గౌడ్, ఉపేంద్ర పాల్గొన్నారు.
పోరాట స్ఫూర్తి ఐలమ్మ: ఎర్రబెల్లి
ఐలమ్మ స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ర్టాన్ని సాధించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో ఉన్న ఐలమ్మ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం గర్వంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతిని అవమానిస్తే ఊరుకోవద్దు: శ్రీనివాస్గౌడ్
చాకలి ఐలమ్మ పోరాటాన్ని అందరూ స్మరించుకొంటూ ముందుకు సాగాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు మంత్రి హాజరయ్యా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, వెంకటేశ్ పాల్గొన్నారు. వనపర్తిలోని బస్టాండ్ ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాళులర్పించారు. ఐలమ్మ ఏ విలువలు, ఆశయాల కోసం నిలబడిందో వాటిని అందరూ గమనించాలని పిలుపునిచ్చారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ సాధన: హరీశ్రావు
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు సర్కిల్లో ఆదివారం ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.