హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో తనపై లైంగికదాడి జరిగిందని రెండురోజుల క్రితం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోనే గందరగోళం ఉన్నప్పటికీ పలు మీడియా సంస్థలు (నమస్తే తెలంగాణ కాదు) స్వతంత్ర దర్యాప్తు పూర్తిచేసి.. ఘోరం జరిగిపోయిందంటూ తీర్పులతో గగ్గోలు పెట్టాయి! రాజకీయ పార్టీలూ హంగామా సృష్టించాయి. కానీ.. నిలకడగా తెలిసిన నిజంతో గాంధీ దవాఖానలో లైంగికదాడి జరుగలేదని వెల్లడైంది! ఆచూకీ తెలియని మహిళ జాడ కూడా దొరికింది! ఈ వ్యవహారం కొలిక్కిరాకముందే ఇదే హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఓ యువతి తనపై ఓ ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది! దీనిపైనా అలజడి రేగింది! యువతికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తే లైంగికదాడి జరుగలేదని తేలింది! పైగా.. తన ప్రియుడిని కేసులో ఇరికించేందుకే యువతి ఈ డ్రామా ఆడిందని బయటకొచ్చింది! కానీ.. ఈ రెండు కేసులలో మీడియా అత్యుత్సాహం, సమాంతర దర్యాప్తు, తీర్పుల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది.
మీడియా సొంత దర్యాప్తు
ఈ రెండు కేసులలోనూ పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరిస్తూ రెండు రోజుల వ్యవధిలోనే కేసును నిగ్గుదేల్చేశారు. కానీ.. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు నిర్ధారించుకోకుం డా పంచ్ హెడ్డింగులతో వార్తలు అల్లేశాయి. సంచలనం రేపడమే పరమావధిగా హైదరాబాద్ ప్రతిష్ఠను దిగజార్చేలా, ప్రతిష్ఠాత్మక వైద్యశాలపై బురదజల్లేలా కథనాలు వండివార్చాయి. దవాఖానలో భద్రతాచర్యలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నదా? అనే కనీస ఆలోచన లేకుండా.. నిత్యం వేలమంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దవాఖానను అప్రతిష్ఠపాలుచేసేలా కథనాలు ప్రసారం చేశాయి.
దాదాపు 500 సీసీ కెమెరాల్లో రికార్డయిన 800 గంటల ఫుటేజీని 10 పోలీస్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాధితులను, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పలుదఫాలుగా విచారించిన తర్వాతే పోలీసులు ఈ కేసులో వాస్తవాలను బయటపెట్టారు. సంతోష్నగర్ కేసులోనూ ఇదే తీరులో నిజాలు నిగ్గుదేల్చారు. సంచలనాల కోసమే పాకులాడే కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికైనా ఆ దురదను వదిలించుకుంటాయా?నిరాధార కథనాలు బాధాకరం గాంధీ ప్రజల దవాఖాన. నిజాలు నిర్ధారించుకోకుండా దీని ప్రతిష్ఠను దిగజార్చేలా కథనాలు రాయడం బాధాక రం. కరోనా సమయంలో ప్రజాసేవే పరమావధిగా సిబ్బంది పనిచేశారు. వారి ఆత్మస్తైర్యాన్ని ఈ కథనాలు దెబ్బతీస్తాయి. ప్రజలను భయాందోళలను గురిచేసేలా మీడియా, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు వ్యవహరించాయి. ఇది సమాజానికి మంచిది కాదు.
-డాక్టర్ రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్