కోల్కతా, మే 17: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసు మరోసారి హై ఓల్టేజ్ డ్రామాకు వేదికైంది. ఈ కేసు విచారణ కోసం ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే మదన్ మిశ్రా, మాజీ మంత్రి సోవన్ చటర్జీని సీబీఐ సోమవారం అరెస్టు చేసి నగరంలోని నిజాం ప్యాలెస్లో ఉన్న తమ కార్యాలయానికి తరలించింది. దీన్ని నిరసిస్తూ టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురుమా పార్టీ నేతలు, కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. భద్రతా సిబ్బందిపైకి టీఎంసీ మద్దతుదారులు రాళ్లు, ఇటుకలను రువ్వారు. హుగ్లీ, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు తదితర ప్రాంతాల్లో టీఎంసీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. హింసాత్మక ఘటనలపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, కార్యకర్తలందరూ ప్రశాంతంగా ఉండాలని టీఎంసీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
అనంతరం, అరెస్టయిన నలుగురికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రుల అరెస్టు సమాచారం తెలిసిన వెంటనే ఉదయం 11 గంటల ప్రాంతంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న సీఎం మమత అక్కడే బైఠాయించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా వారిని అరెస్టు చేశారు. నన్ను కూడా అరెస్టు చేయండి’ అని సీబీఐ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ఆరు గంటల అనంతరం ఆమె సీబీఐ ఆఫీస్ నుంచి వెళ్లిపోయినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ తనను అరెస్టు చేసిందని ఫిర్హాద్ ఆరోపించారు.
నేపథ్యమిదీ..
ఇంపెక్స్ పేరిట తాను నెలకొల్పిన కంపెనీకి లాభంచేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తానని పేర్కొంటూ నారద న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు మ్యాథ్యూ శామ్యూల్ 2014లో టీఎంసీ మంత్రులు, ఎంపీలతో బేరసారాలు నడిపారు. ఈ ఉదంతాన్ని వీడియో రికార్డు చేసి 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘నారద’ స్టింగ్ ఆపరేషన్ విడుదల చేశారు.