రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది. రోడ్డు ఏదైనా పది కాలాలపాటు మన్నికగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. వాస్తవంగా బీటీ రోడ్ల కాలపరిమితి ఐదేండ్ల వరకే ఉంటుండగా.. తాజాగా నిర్మిస్తున్న రోడ్లు పదేండ్లదాకా చెక్కు చెదరకుండా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఐదేండ్లకోసారి చిన్న మరమ్మతుచేస్తే 30 ఏండ్లదాకా కొత్త రోడ్డు వేయాల్సిన అవసరం ఉండదంటున్నారు. 15 ఏండ్లపాటు మన్నికగా ఉండేలా సీసీ రోడ్లు, 30 ఏండ్ల పాటు ఇబ్బంది లేనివిధంగా వైట్ టాపింగ్ రోడ్లు నిర్మిస్తున్నారు.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రస్తుతం బీటీ, సీసీ, వైట్టాపింగ్ పద్ధతుల్లో రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. గతంలో మట్టి.. కంకర కలిసి రోడ్డువేసి, దానిపై బీటీ (తారు) వేసేవాళ్లు.. దీంతో వర్షపునీరు మట్టిలోనే ఉండి తారురోడ్డు త్వరగా చెడిపోయేది. కొన్ని జిల్లాల్లో రోడ్లు కొద్ది రోజులకే ఆనవాళ్లు కూడా లేకుండాపోయేది. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రజాధనం వృథా కాకుండా ఎక్కువకాలం మన్నికగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28,087 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో అత్యధికంగా 26,028 కిలోమీటర్లు బీటీ (తారు) ఉన్నాయి. 723 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి. వైట్ టాపింగ్ రోడ్లు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణలో నేల స్వభావాన్ని బట్టి రోడ్ల నిర్మాణం సాగుతున్నది. ముఖ్యంగా నల్ల నేలలు, లూజు మట్టి నేలలు ఉన్నచోట ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేలలు ఉన్నచోట మట్టి పైపొరను పూర్తిగా తొలిగిస్తున్నారు.
ప్రతి రోడ్డును నేల కంటే ఐదు మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉండేలా.. వెట్మిక్స్ మెకడమ్ పద్ధతిలో నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో మట్టి మీద అరమీటర్ ఎత్తువరకు సబ్గ్రేడ్ (సీబీఆర్ వ్యాల్యూ ఉండే గట్టి మొరం) వేస్తారు. అదిలాబాద్ జిల్లాలో బేలా, కెరిమెరి తదితర ప్రాంతాల్లో నేలలు గట్టిగా లేకపోవడంతో నిర్మల్ జిల్లా నుంచి గట్టి మొరం తెప్పించి రోడ్డు అడుగు భాగాన వేస్తున్నారు. లూజు మట్టిని అంతా తీసివేసి, గట్టి మొరం మీద జీఎస్బీ (గ్రావెల్ సబ్బేస్) వేస్తారు. రోడ్లు నిర్మాణంలో అత్యంత కీలకమైనది ఈ లేయర్. 20 సెంటీమీటర్లు వేసే ఈ లేయర్లో రాక్డస్ట్, కంకర వినియోగిస్తారు. ఇది వర్షపు నీటిని రోడ్లకిరువైపులా పల్లపు ప్రాంతాలకు పంపిస్తుంది. రోడ్డుమధ్యలో అడుగుభాగాన నీటిని నిల్వ ఉండనీయదు.
ఇది డ్రైనేజీ లేయర్లా పనిచేస్తుందని అదిలాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సయ్య తెలిపారు. చాలాకాలం మన్నికగా ఉండడంలో ఈ లేయర్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. దీనిమీద రాక్డస్ట్తోపాటు చిన్న మీడియం సైజు కంకరతో 10 ఇంచులు వెట్మిక్స్ వేస్తారు. దీనివల్ల రోడ్డులోకి ఎటునుంచి కూడా బురద చేరే అవకాశం ఉండదు. దానిపై 20 ఎంఎం కంకరతో డీబీఎం(డెన్స్బిట్ మినరల్స్), ఆపై 10ఎంఎం కంకర తారు కలిపి బీసీ (బిట్ మినరల్స్) వేస్తారు. తెలంగాణ అంతటా ఈ పద్ధతిలోనే రోడ్లను నిర్మిస్తున్నారు. భారీ వాహనాలు ఎక్కువగా తిరిగే, రద్దీ తక్కువగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ స్టడీ ఆధారంగా జీఎస్బీ లేయర్, వెట్మిక్స్ లేయర్ల వాడకాన్ని ఇంజినీరింగ్ అధికారులు నిర్ణయిస్తారు. రద్దీ తక్కువగా ఉంటే జీఎస్బీ లేయర్ 200 ఎంఎం, ఎక్కువగా ఉంటే 250 ఎంఎం వాడతారని సీనియర్ ఇంజినీరింగ్ అధికారి దివాకర్ తెలిపారు.
గ్రామాల్లో అంతర్గత రోడ్లన్నీ సీసీలే..
రాష్ట్ర రహదారుల్లో గ్రామాలున్న చోట, నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నచోట మాత్రమే సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లలో ఎక్కువ రోడ్లు సీసీనే. మున్సిపాలిటీల్లోనూ వీటినే నిర్మిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో 150 ఎంఎం జీఎస్బీ (గ్రాన్యులర్ సబ్బేస్) వినియోగిస్తారు. ఇందులో పెద్ద కంకర, రాక్ డస్ట్ ఉంటుంది. దీనిపై డీలేన్ కాంక్రీట్(డీఎల్సీ)100 ఎంఎం ఉంటుంది. దీనిపైన 200 ఎంఎంతో కాంక్రీట్ రోడ్డును నిర్మిస్తారు.
వైట్ టాపింగ్ రోడ్లను జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే నిర్మించారు. వైట్ టాపింగ్ రోడ్లను సీసీ రోడ్ల మాదిరిగానే నిర్మించి.. పై భాగంలో పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) పద్ధతిని వాడతారు. సీసీ రోడ్ల మాదిరిగా గట్టిగా, గరుకుగా ఉండకుండా బీటీ రోడ్లపై వెళ్లినట్టుగానే ఉంటుంది.