80 లక్షల టన్నులకుపైగా సేకరించాలని నిర్ణయం
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుకు 6,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంన్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కేంద్రాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ యాసంగిలో 80-90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన రూ.20 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.68 వేల కోట్ల విలువైన 3.93 కోట్ల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది వానకాలంలో 1.05 కోట్ల టన్నుల ధా న్యం దిగుబడి రాగా.. యాసంగిలో 1.32 కోట్ల టన్నులు వస్తుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (ఎఫ్సీఐ) ఈ ఒక్క ఏడాది మాత్రమే దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు.