హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకుంటే, అంత త్వరగా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సూత్రాన్ని తెలంగాణ సర్కారు పక్కాగా అమలు చేసింది. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 51 శాతానికి చేరింది. వ్యాక్సిన్ తీసుకోని 25 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉన్నట్టు సీరో సర్వే ఇటీవల వెల్లడించింది. మొత్తంగా 76 శాతం మందికి కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. 2.20 కోట్ల మందికి టీకాలు వేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే కోటి 12 లక్షల మందికి తొలి డోసు, 33 లక్షల మందికి రెండో డోసు పూర్తి చేసింది.
సేఫ్ జోన్లో 45 ఏండ్లు నిండినవాళ్లు
45 ఏండ్లు నిండినవారిలో 80శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్ పూర్తయ్యింది. ఈ గ్రూపునకు చెంది వ్యాక్సిన్ తీసుకోని వారిలో 50 శాతం ప్రతిరక్షకాలు ఉన్నట్టు సీరో సర్వే వెల్లడించింది. అంటే మొత్తంగా 90శాతం మందికి రక్షణ లభించినట్టేనని స్పష్టమవుతున్నది. 18-44 ఏండ్ల వారిలో 70 శాతం మంది, 18 ఏండ్లకు దిగువన ఉన్న వారిలో 56 శాతం మంది సేఫ్ జోన్లో ఉన్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నారుల్లో వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉంటుందని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
డెల్టాతో ముప్పు లేనట్టే
డెల్టా వేరియంట్ రెండో వేవ్కు కారణమైంది. మన రాష్ట్రంలో డెల్టా ప్రతి ముగ్గురిలో ఒకరికి వచ్చి పోయినట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు యూఎస్, యూకే సహా 130 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరిస్తున్నది. ఇప్పుడా వేరియంట్ తిరిగి మూడో వేవ్కు కారణం కాబోదని వైద్య నిపుణులు చెప్తున్నారు. డెల్టా కేసులు నమోదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో డెల్టా వ్యతిరేక ప్రతిరక్షకాలు వృద్ధి చెందాయని అంటున్నారు. రెండో వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తున్నదని, ఇప్పటికిప్పుడు థర్డ్ వేవ్ వచ్చే చాన్స్ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
థర్డ్ వేవ్ అవకాశం తక్కువే
రాష్ట్రంలో టీకాలు, నేచురల్ ఇమ్యూనిటీ వల్ల దాదాపు 75శాతం మందికి వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రావటం మంచి పరిణామం. సెకండ్ వేవ్ వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. దీనికి తోడు దాదాపు 50శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. ఈ రెండు రకాలుగా డెల్టా వేరియంట్ను ఎదుర్కొనే శక్తి దాదాపుగా మనకు వచ్చింది. మన దేశంలో థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా వేవ్లా కాకుండా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది. వేవ్ రూపంలో రావాలంటే డెల్టా కంటే బలమైన మ్యుటేషన్ వృద్ధి చెందాలి. దానికి సమయం పడుతుందనే చెప్పాలి.
కొవిడ్ రహితంగా రాజన్నపేట
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ప్రాజెక్టు మదద్’ సక్సెస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట కొవిడ్ రహిత గ్రామంగా నిలిచింది. వైద్యారోగ్యశాఖతో కలిసి తాము చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని ‘ప్రాజెక్ట్ మదద్’ స్వచ్ఛంద సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2,253 మంది జనాభా గల రాజన్నపేటను నూటికి నూరు శాతం ‘కొవిడ్ రహిత- కొవిడ్ను తట్టుకోగల’ గ్రామంగా మార్చడం సాధ్యమైందని పేర్కొన్నది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడంతోపాటు కరోనా కట్టడి చర్యలను పకడ్బందీగా చేపట్టడం వల్ల ఇది సాధ్యమైందని వెల్లడించింది. కరోనా పట్ల ఉన్న అపోహలను తొలగించడం, వ్యాక్సిన్ పట్ల సందేహాలను నివృత్తిచేయడం వంటి చర్యలతో చికిత్స, వైద్య సదుపాయాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసినట్టు తెలిపింది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించింది. యువకులు, అమెరికాలో స్థిరపడ్డ భారతీయ వైద్య నిపుణులు కలిసి గ్రామీణ ప్రజల కోసం ‘ప్రాజెక్ట్ మదద్’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.