2020-21 విద్యాసంవత్సరానికి 26 వేల పైచిలుకు పాఠశాలల్లో 26,37,257 విద్యార్థులున్నట్టు గుర్తించారు. 1-10 తరగతుల్లో రాష్ట్రం మొత్తంలో 60 లక్షలమంది విద్యార్థులుండగా, 26 లక్షల మంది సర్కారు బడుల్లో చదువుకుంటున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కతేల్చారు. 2020-21 విద్యాసంవత్సరానికి 26వేల పైచిలుకు పాఠశాలల్లో 26,37, 257 విద్యార్థులున్నట్టు గుర్తించారు. 1-10 తరగతుల్లో రాష్ట్రం మొత్తంలో 60 లక్షలమంది విద్యార్థులుండగా, 26 లక్షల మంది సర్కారు బడుల్లో చదువుకుంటున్నారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ సిస్టం(యూ-డైస్) డాటా సేకరణ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ఇటీవలే చేపట్టారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వివరాలను సేకరించారు.
కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరమంతా గందరగోళంగా నడిచింది. దీని ప్రభావం ఎన్రోల్మెంట్పైనా పడింది. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరినా 1, 6వ తరగతుల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యపై స్పష్టతరాలేదు. పూర్వప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని కొత్తగా 1వ తరగతిలో, 5వ తరగతి పూర్తిచేసుకుని, 6వ తరగతిలో చేరాల్సిన వారిలో చాలా మంది విద్యార్థులు ఎక్కడా ఎన్రోల్ కాలేదు. కరోనాతో చాలా కుటుంబాలు వలసలు పోవడంతో పిల్లలంతా చెల్లాచెదరయ్యారు. వీరిని డ్రాపౌట్లుగా తేల్చిన అధికారులు, ఆయా విద్యార్థులను గుర్తించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఆదేశాల మేరకు సర్వే కూడా నిర్వహించారు. సర్వేలో గుర్తించిన వారిని తిరిగి బడుల్లో చేర్పించేందుకు ప్రయత్నించారు. తాజాగా మార్చి 31 వరకు ప్రవేశాలకు అవకాశమిచ్చి, ప్రవేశాల సంఖ్యను ఖరారుచేశారు. ఆ వివరాలనే యూ-డైస్లో పొందుపరిచారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1.74 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 1.62 లక్షలు, సంగారెడ్డిలో 1.30 లక్షలమంది విద్యార్థులు బడిలో చేరారు. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 27 వేలు, ములుగులో 29 వేలు, పెద్దపల్లి జిల్లాలో 38 వేలమంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో చేరారు.