హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నామని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,934 కోట్లు నిధులు వెచ్చిస్తే.. టీఆర్ఎస్ సర్కార్ ఏడేండ్లలో రూ.14,887 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. దాదాపు నాలుగు రెట్లు అధికంగా వెచ్చించామని వివరించారు. ప్రతి అంశంలోనూ రంధ్రాన్వేషణ, విమర్శ తప్ప ఇంకో కోణం ఉండకూడదన్న ధోరణి సరికాదని హితవు పలికారు. సోమవారం అసెంబ్లీలో పాతబస్తీ అభివృద్ధిపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పాతబస్తీ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించడమే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. ఏడేండ్లలో పనిచేశాం.. క్షేత్రస్థాయిలో ఫలితాలున్నాయి కాబట్టే ధైర్యంగా చర్చ పెట్టామని తెలిపా రు.
ఓల్డ్సిటీలో రోడ్ల అభివృద్ధికి ఏడు వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,545 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. హాకర్స్, స్ట్రీట్ వెండర్ల కోసం మూసీనదిపై ప్రత్యేకంగా బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలు తుది పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. పాత నగర వైభవాన్ని చాటేలా 14 కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నామని చెప్పా రు. అమృత్సర్ పెడస్ట్రియన్ ప్రాజెక్టు తరహాలో చార్మినార్ పెడస్ట్రియన్ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తామని చెప్పారు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, ఢిల్లీలోని చాందినీచౌక్ను పరిశీలించేందుకు ఎంఐ ఎం ఎమ్మెల్యే బలాల, అధికారుల నేతృత్వంలో బృందాన్ని ఇప్పటికే పంపించినట్టు తెలిపారు. ఇప్పటివరకు పెడస్ట్రియన్ ప్రాజెక్టుల కోసం రూ.33 కోట్లు ఖర్చు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఓల్డ్సిటీ మెట్రోకి కట్టుబడి ఉన్నాం
పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖానకు మంచి భవనం, చక్కటి వైద్యం అందించే విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పాతబస్తీలో 8 ప్రసూతి, మూడు ఏరియా దవాఖానలు ఏడు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 50 పట్టణ ప్రాథమిక కేంద్రాలను బలోపేతం చేశామని తెలిపారు. 84 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. బహదూర్పురా, ఫలక్నుమాలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
వివక్షకు చోటు లేదు
ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా ఆ ప్రాంత ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆలోచనతోనే సర్కార్ పనిచేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ పక్ష నాయకుడు భట్టివిక్రమార్క చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అభివృద్ధి విషయంలో పాతనగరం, కొత్తనగరం అన్న వ్యత్యాసాలు లేకుండా చర్య లు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రం చేస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలిచినప్పటికీ హమీని నెరవేర్చామని పేర్కొన్నారు. కక్షసాధింపు రాజకీయాలు చేయబోమని, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తాం అని రాజాసింగ్ను ఉద్దేశించి అన్నారు. ‘ హయాత్ లేకే చలో.. హైనాత్ లేకే చలో.. చలేతో సారే జమానేకో సాత్లేకే చలో..’ అన్న మఖ్దుం మొయుద్దీన్ మాటలే స్ఫూర్తిగా పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. హైదరాబాద్ సమస్యలపై చర్చించేందుకు బుధవారం నగర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.