మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారి
ఒక్కరోజులోనే 25వేలకు పైగా కేసులు నమోదు
కరోనా వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికం
ఆంక్షలను కఠినతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆఫీసులు, థియేటర్లలో 50%మందికే అనుమతి
పంజాబ్లో నెలాఖరువరకూ స్కూళ్లు బంద్
దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 40 వేల కేసులు
ముంబై, మార్చి 19: మహారాష్ట్రను కరోనా మహమ్మారి మరోసారి హడలెత్తిస్తున్నది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,833 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు వెయ్యికిపైగా కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఈ నెలాఖరు వరకు డ్రామా థియేటర్లు, ఆడిటోరియంలు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే వైద్య, ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు సంబంధించినవి మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే నడువాలని స్పష్టంచేసింది.
పంజాబ్ అప్రమత్తం
కరోనా ఉద్ధృతి కారణంగా ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు పంజాబ్ ప్రకటించింది. సినిమా థియేటర్లలోకి 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, మాల్స్లో 100 మందికి మించరాదని స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది.
ఈ ఏడాదిలోనే అత్యధికంగా..
పలు రాష్ర్టాల్లో వైరస్ విజృంభిస్తుండటంతో దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,726 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో రికార్డయిన అత్యధిక కేసులు ఇవేకావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కి చేరింది. కొత్తగా 154 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,59,370కి పెరిగింది. దేశంలో 2,71,282 క్రియాకీలక కేసులు ఉన్నాయి.
ఎనిమిది రాష్ర్టాల్లో వైరస్ విజృంభణ
మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ర్టాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని మొత్తం కేసుల్లో ఈ రాష్ర్టాల వాటానే 80 శాతానికిపైగా ఉన్నట్టు తెలిపింది. 65% పైగా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
ఆస్ట్రాజెనెకా టీకాపై నిషేధం ఎత్తివేత
బెర్లిన్, మార్చి 19: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పై విధించిన నిషేధాన్ని జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ శుక్రవారం తొలిగించాయి. ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దేశాలు ఆ టీకాపై ఇటీవల నిషేధం విధించాయి. అయితే, ఆ టీకా సురక్షితమేనని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ గురువారం ప్రకటించింది.
అవసరమైతే మళ్లీ లాక్డౌన్
కరోనా కట్టడికి లాక్డౌన్ను ఒక ఆప్షన్గా చూస్తున్నాం. అయితే ప్రజలు గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సహకరిస్తారని, స్వచ్ఛందంగా కరోనా మార్గదర్శకాలు పాటిస్తారని విశ్వసిస్తున్నా. గతేడాది మహమ్మారి మొదలైనప్పుడు వైరస్పై పోరాడటానికి మన వద్ద ఏమీ లేదు. ఇప్పుడు కరోనా నుంచి రక్షణకు టీకా అయినా ఉన్నది. ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ముందుకు రావాలి.
ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
కరోనా టీకాలపై అపోహలు అక్కర్లేదు: హర్షవర్ధన్
న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో అనుమతిచ్చిన రెండు కరోనా వ్యాక్సిన్లపై (కొవాగ్జిన్, కొవిషీల్డ్) అపోహలు అక్కర్లేదని, ప్రజలు నిస్సంకోచంగా టీకా వేసుకోవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.5-4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారని, దుష్ప్రభావాలు కేవలం 0.000432 శాతం మందిలో మాత్రమే కనిపించాయని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కరోనా ఉత్పరివర్తనాలపై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నదని, టీకా కాంపోజిషన్ మార్చాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ చౌబే స్పష్టంచేశారు.
పిల్లలపై ప్రభావం తక్కువే
కరోనా వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అనుమతిచ్చిన ప్రైవేట్ దవాఖానలతోపాటు మరిన్ని ప్రైవేట్ దవాఖానలకు అనుమతివ్వాలని తెలంగాణతోపాటు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తులకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం వెల్లడించింది. 0-14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలపై కరోనా ప్రభావం తక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయని హర్షవర్ధన్ తెలిపారు. వారిపై వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరం లేదని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
‘టీకా నిబంధనను పునఃపరిశీలిస్తాం’
బీజింగ్, మార్చి 19: భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా స్వదేశాలకు వెళ్లి.. తిరిగి చైనాకు రావాలనుకునే వారు తప్పకుండా చైనా టీకాను తీసుకోవాలని ఇటీవల ఆ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిబంధనను భారతీయ విద్యార్థుల విషయంలో పునఃపరిశీలిస్తామని చైనా శుక్రవారం ప్రకటించింది.
మోదీ దుర్యోధనుడు.. అమిత్షా దుశ్శాసనుడు
ఎగ్రా , మార్చి 19: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలను దుర్యోధన దుశ్శాసులతో పోల్చారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. ‘మనకు బీజేపీ వద్దు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్ జాఫర్ (బీజేపీలో చేరిన సువేందు అధికారి) అస్సలు వద్దు. అల్లర్లు సృష్టించేవాళ్లు, దోచుకునేవాళ్లు వద్దు’ అని ఓ ఎన్నికల సభలో పేర్కొన్నారు.