తెలంగాణకు కొడుకు నడిచొచ్చిన వేళావిశేషం
ఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించే పత్రికే లేని చోట.. ఉన్న పత్రికలన్నీ సీమాంధ్ర పక్షపాతంతో తెలంగాణ గొప్పదనాలను మరుగునపట్టి ఉంచినవేళ.. తెలంగాణ కష్టాలు కష్టాలే కావన్నట్టు వాటిని వెనుక పేజీల్లో మారుమూలకు నెట్టేసిన దారుణాల మధ్య! 2011 జూన్ 6.. తెలంగాణకు ఓ పండుగ. తెలంగాణ ఉద్యమానికి అండగా ఒక కొత్త శక్తి ఉదయించిన మహోజ్వల సందర్భం!
తొలివిడుత పోరాట వారసత్వాన్ని సజీవంగా నిలుపుతూ వచ్చిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆ వేదికపై! మలి విడుత ఉద్యమానికి ఆశాకిరణంగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అదే వేదికపై! మా తెలంగాణ మాగ్గావాలని చంద్రబాబును నిలదీసిన సాధారణ రైతు ఫణికర మల్లయ్య కూడా అక్కడే! తెలంగాణపై మనాదితో ప్రాణాలు ఇచ్చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య భార్య.. వేలమంది ఉద్యమకారులు ప్రత్యక్షంగా, కోట్లమంది అభిమానులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన కార్యక్రమం.. నమస్తే తెలంగాణ పత్రిక ఆవిర్భావం!
సీమాంధ్రలో తెలంగాణవాదం వినిపించి..
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోతానంటున్న తెలంగాణ సమాజం.. విడిపోవాల్సిన ఆవశ్యకతను తన ప్రాంతవాసులకు వివరిస్తున్న సమయం! విడిపోతే చెడిపోతారని తెలంగాణ వ్యతిరేకులు ఎకసెక్కాలాడుతున్నదీ అదే సమయం!
ఒక రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాలు తీవ్ర భావోద్వేగాల మధ్య ఉన్న వేళ నమస్తే తెలంగాణ మరో సాహసం చేసింది! ‘విభజన వికాసానికే’ అని చాటుతూ.. నాలుగు పేజీలతో బ్రాడ్షీట్ పత్రికను ముద్రించుకుని, రాష్ట్రం విడిపోతే తెలంగాణకే కాదూ.. ఏపీకీ కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఒక వాహనానికి మైక్ పెట్టుకుని సీమాంధ్ర పర్యటనకు బయల్దేరింది. ఆంధ్ర ప్రాంత సరిహద్దు మొదలు.. అనేకమంది ఆహ్వానించారు. కొందరు వెళ్లిపొమ్మని బెదిరించారు. అమలాపురంలో కొందరు వ్యతిరేక శక్తులు ఆ వ్యాన్పై దాడిచేసి.. ధ్వంసం చేశాయి! అయినా.. తెలంగాణ సమాజం తరఫున సోదర ప్రాంతవాసులకు విన్నపాలు అందించామన్న తృప్తి మిగిలింది!
ఆత్మగౌరవ పుత్రికకు తొలి సన్మానం!
మా పత్రికకు చందాదారులుగా చేరండి.. అని ప్రజల వద్దకు వివిధ పత్రికలు వెళ్లడం సహజం!
కానీ.. స్వచ్ఛందంగా పత్రికకు చందాదారులవడమే కాదు.. తొలి కాపీని మేళతాళాలు మోగించి కొందరు.. పటాకులు కాల్చి మరికొందరు.. బొట్టుపెట్టి.. కొబ్బరికాయ కొట్టి ఇంకొందరు.. తమ ఊళ్లకు స్వాగతించిన అరుదైన సన్మానం పొందింది నమస్తే తెలంగాణ! అది నమస్తే తెలంగాణపై ప్రజలకున్న అభిమానం! పదేండ్లుగా మా ప్రస్థానానికి, మా స్ఫూర్తికి అదే బలం.. బలగం!
తెలంగాణ కథకు పట్టాభిషేకం
తెలంగాణ సాహిత్యానికి పునర్వైభవాన్ని తీసుకొని వచ్చేందుకు నమస్తే తెలంగాణ మొదట్నుంచీ కంకణబద్ధమైంది. ఈ ప్రాంత భాషను యాసగా, మాండలికంగా మార్చి.. ప్రామాణికత లేకుండా చేసిన వలసల దౌష్ట్యాన్ని చెరిపివేసి.. మన భాషకు పట్టం కట్టడం లక్ష్యంగా కృషి చేస్తూ వచ్చింది.
బ్రిటిష్ ఆంధ్ర ప్రభావానికి లోనుకాకుండా స్వచ్ఛంగా ఉన్న అచ్చమైన తెలంగాణ తెలుగు భాషను పరిపుష్టంచేయడానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ముల్కనూరు గ్రంథాలయంతో సమిష్టిగా రాష్ట్రస్థాయి కథల పోటీలు నిర్వహించి విజేతలను నగదు పురస్కారాలతో సత్కరించడమే కాకుండా దాదాపు 52 కథలను ప్రచురించి తెలంగాణ కథకు కీర్తికిరీటాన్ని తొడిగింది.
ముక్కోటి దేవతలు ఒక్కటై.. గ్రంథమై
తెలంగాణ ఆధ్యాత్మిక భావ వేదిక. భక్తి ఉద్యమాలకు పుట్టిల్లు. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలను సమాంతరంగా ఆదరించిన పుణ్యభూమి. శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులు సుసంపన్నంచేసిన ఆలయాలు ఎన్నెన్నో.
వాటి శిల్పసంపదకు సాటిరాగలది కనిపించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న దేవాలయాలను కానీ, వాటి ఔన్నత్యాన్ని కానీ పట్టించుకొన్న నాథుడు లేడు. నమస్తే తెలంగాణ పత్రిక.. తెలంగాణ ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రపంచానికి చాటడానికి కంకణం కట్టుకొన్నది. తెలంగాణలోని మూలమూలనా తిరిగి శోధించి అపూర్వమూ.. అపురూపమూ.. అద్భుతమైన ఆలయాలు.. వాటిలోని దేవతామూర్తుల చిత్రాలను సేకరించి నిరుపమానమైన ఛాయాచిత్ర గ్రంథాన్ని ప్రచురించింది.
ఇది నభూతో నభవిష్యతి.
అవినీతిపై మోగించిన ‘ధర్మగంట’
రెవెన్యూ వ్యవస్థలో రసిగారుతున్న అవినీతి రాచకురుపును శస్త్రచికిత్స చేసి, కోసిపారేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది నమస్తే తెలంగాణ సుదీర్ఘకాలం నిర్వహించిన ‘ధర్మగంట’!
ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు జరుగక డీలాపడి.. ఈ ‘ధర్మగంట’ను మోగించినవారికి సత్వర న్యాయం అందించింది.. సగటు పౌరుల చేతిలో ఆయుధంగా మారింది. అన్యాయానికి గురవుతున్నవారి పక్షాన నిలిచి.. వారి కష్టాలను ప్రచురించి.. పరిష్కారాలు సాధించి పెట్టిందీ ‘ధర్మగంట’!
అమరుల కుటుంబాల కష్టం పంచుకొని..
నేడు మనం అనుభవిస్తున్న ప్రత్యేక తెలంగాణ.. అనేకమంది అమరుల స్వప్నం! ఉధృతమవుతున్న ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రతీపశక్తులు చేయని ప్రయత్నం లేదు! వాటికి మనసు వికలమై, ప్రాణత్యాగాలతోనైనా పాలకులు కండ్లు తెరుస్తారన్న పిచ్చి నమ్మకంతో అనేకమంది ప్రాణాలు బలిదానం చేశారు. కానీ.. వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి.
బిడ్డలను కోల్పోయిన తండ్రులు.. తండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు.. జీవితాంతం కలిసి నడుస్తానని ప్రమాణం చేసిన తోడు.. ఓ తెల్లవారుజామున శవమై తేలితే ఏడ్వటానికీ కన్నీళ్లు లేని అభ్యాగుల ఆత్మగోస! వారి కన్నీళ్లను తుడిచేందుకు చిరు ప్రయత్నం మొదలు పెట్టింది నమస్తే తెలంగాణ. ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటుచేసి సేకరించిన విరాళాలతో వారి కష్టంలో తానూ పాలుపంచుకున్నది!
బాధ్యత చాటిన ప్రజా మ్యానిఫెస్టో
ఉద్యమం ఫలించి, ఆకాంక్ష నెరవేరి, యాచించే స్థాయి నుంచి.. శాసించే స్థాయికి చేరుకొన్న సమయాన రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టబోయే పాలకులు చేయాల్సిన శాసనాలు ఎలా ఉండాలి? బంగారు తెలంగాణ సాధనకు మార్గమేంటి?
స్వరాష్ట్రం సిద్ధించినప్పటికీ.. దీన్నొక విఫల ప్రయోగంగా మార్చాలని కుట్రలు పన్నుతున్న శక్తుల పీచమణిచేందుకు నిర్వహించాల్సిన కర్తవ్యాలేంటి? అందుకు నమస్తే తెలంగాణ వినూత్న సాహసమే చేసింది. అభివృద్ధిని తెలంగాణీకరించడమే సూత్రంగా, అమరుల ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఏకంగా ప్రజా మ్యానిఫెస్టోను ఆవిష్కరించి, తన బాధ్యతను చాటుకున్నది!
శ్రీకుట్ర కమిటీ బాగోతం రట్టు
నమస్తే తెలంగాణ.. తెలంగాణకు నడిచొచ్చే కొడుకు అని నిరూపించు కున్నది.. పత్రిక నడవడం మొదలుపెట్టిన నాలుగోరోజే శ్రీకృష్ణ కమిటీ కుట్రలను బయటపెట్టిన తీరు!
అప్పటిదాకా శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్లో ఏమున్నదో కొందరికి చూచాయగా తెలుసుకానీ.. పూర్తిపాఠం బయటకు వచ్చింది లేదు! కానీ.. ఆ రహస్యంపై దండెత్తి.. కుట్ర ఆయువు పట్టి.. బరికీడ్చి.. నగ్నంగా నిలబెట్టింది.. నమస్తే తెలంగాణ! సీమాంధ్ర పాలకుల దుష్ట పన్నాగాలను తూర్పారబట్టి.. తెలంగాణవాదుల్లో ఉద్యమ చైతన్యాన్ని పెంచింది.. నమస్తే తెలంగాణ!
యాసను గేలిచేసిన శక్తులపై ఎత్తిన గొడ్డలి.. బొమ్మ బొరుసు
తెలంగాణ యాస అంటే విలన్లు, హాస్యగాళ్లదేనని తెలంగాణ ప్రాంత ప్రజల్ని సైతం నమ్మించే స్థాయిలో జరిగిన దుష్ప్రచారంపై నమస్తే తెలంగాణ ఎత్తిన గొడ్డలి.. ‘బొమ్మా బొరుసు’!
పదహారు రీళ్ల సినీ మాయాజాలాన్ని దూద్కా దూద్.. పానీకా పానీ అన్నట్టు లోతుల్లోకి వెళ్లి విశ్లేషించిన కథనాలు.. మద్రాస్ నుంచి తరలివచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగా వేసిన సీమాంధ్ర సినీ పెద్దలు హైదరాబాద్ను గుప్పిటపట్టిన వైనం, తెలంగాణ అస్తిత్వంపై చేసిన దాడిపై నమస్తే తెలంగాణ సంధించిన ‘అక్షర’ శస్ర్తాలు సంచలనమే రేపాయి.