సిరిసిల్ల రూరల్, జూన్ 13: చేపల వేటకు వెళ్లి మృతిచెందిన కనకరాజు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అద్దె ఇంటిలో బతుకు వెళ్లదీస్తున్న అతని కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లును మంజూరు చేయడంతోపాటు రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేసి ఔదార్యం చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరుకు చెందిన బత్తిన కనకరాజు 20 రోజులక్రితం మానేరువాగుకు చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. కనకరాజు మృతితో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి దయనీయ స్థితిని స్థానిక సర్పంచ్ సరితానవీన్రావు దంపతులు మంత్రి కేటీఆర్కు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్ బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయడంతోపాటు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం రాత్రి అధికారులు కనకరాజు నివాసానికి వెళ్లారు. ఆయన భార్యకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు పత్రంతోపాటు రూ.50 వేల చెక్కును నాయబ్ తాసిల్ద్దార్ రజిత, ఆర్ఐ సంతోష్ అందజేశారు. ఈ సందర్భంగా కనకరాజు కుటుంబసభ్యులతోపాటు సర్పంచ్ సురభి సరితానవీన్రావు దంపతులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.