గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు
ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్న పశుసంవర్ధక శాఖ
జిల్లాలో 326 సంఘాలు
ఆలేరు టౌన్, ఏప్రిల్ 21 : గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడేండ్ల కిందట ఎన్నికలు నిర్వహించారు.ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… పలుకారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. సహకార సంఘం ఎన్నికల పదవీ కాలం ముగిసిపోవడంతో పశుసంవర్ధకశాఖ అధికారులే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. జిల్లాలో 326 సంఘాలు ఉన్నాయి. అయితే ఇందులో 26 సంఘాల వరకు 2022లో పదవీ కాలం ముగియనున్నది. ఈ సంఘాలకు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రాథమిక గొర్రెల కాపర్ల సంఘం ఎన్నికలు, జిల్లాస్థాయి గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్, చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో పశుసంవర్ధకశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడేండ్ల కిందట ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రతీ ఐదేండ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సహకార సంఘం ఎన్నిల పదవీ కాలం ముగిసిపోవడంతో పశుసంవర్ధకశాఖ అధికారులే పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 326 సంఘాలు ఉన్నాయి. అయితే ఇందులో 26 సంఘాల వరకు 2022లో పదవీ కాలం ముగియనున్నది. ఈ సంఘాలకు 2017లో ఎన్నికలు జరిగాయి. ప్రాథమిక గొర్రెల కాపర్ల సంఘం ఎన్నికలు, జిల్లాస్థాయి గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్, చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో పశుసంవర్ధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
దీని కోసం కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకోవడంతోపాటు ఓటర్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో సంఘాల సభ్యులు 50 కంటే తక్కువగా ఉంటే రూ.500, 50 మంది సభ్యుల కంటే ఎక్కువ ఉంటే రూ.2వేలు డీడీలు చెల్లించి అధికారులకు అందిస్తున్నారు. ఓటర్ల జాబితాను పూర్తి చేసి హైదరాబాద్లోని సహకార ఎన్నికల రాష్ట్ర కమిషనర్కు పంపాల్సి ఉంటుంది. వారు జాబితాను పరిశీలించి ప్రభుత్వ అనుమతితో ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఓటర్ జాబితా తయారు చేయడం పశు వైద్యాధికారులకు తలనొప్పిగా మారింది. గ్రామాల్లో పశువులకు, జీవాలకు టీకాలు వేయడం, గొర్రెల యూనిట్ల పంపిణీ, రోజువారీ విధులతో వారు బిజీగా పడుతున్న తరుణంలో ఓటర్ జాబితాను తయారు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. సంఘాలకు పర్సన్ ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు వారినే సంఘాలకు నోడల్ అధికారులుగా పశుసంవర్ధక శాఖ నియమించింది. దీంతో వారు ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. క్రమసంఖ్య, సభ్యుడి రిజిస్టర్ నంబర్, పేరు, తండ్రి పేరు, వయస్సు, సంఘం పేరు, గ్రామం పేరు, మండలం పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతోపాటు పాస్ ఫొటోను జత చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో గొర్రెలకాపర్లు కొన్నిచోట్ల సహకరించడంలేదు. దీంతో వారికి జాబితా తయారు చేయడం ఇబ్బందిగా మారింది. గెలిచిన అధ్యక్షులు జిల్లాస్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో సంఘంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శితోపాటు 11మంది సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లా కమిటీలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, కార్యదర్శితోపాటు 11 మంది సభ్యులను ఆయా సంఘాల నుంచి ఎన్నికైన అధ్యక్షులు ఎన్నుకుంటారు.
కులవృత్తులకు పూర్వ వైభవం
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలకాపర్ల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను కేటాయిస్తున్నది. గొర్రెల పెంపకం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి గొర్రెల యూనిట్లను అందజేస్తుంది. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రాయితీ గొర్రెలను పంపిణీ చేస్తుంది. గతంలో పనులు లేక వలస వెళ్లేవారు. ఎంతో మంది కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి. ప్రస్తుత బడ్జెట్లో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు నిధులను కేటాయించింది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్కు రూ.1.25 లక్షలు కాగా, ప్రభుత్వం 75శాతం భరిస్తుంది. అంటే రూ.93,750 ఇస్తుండగా, లబ్ధిదారు వాటా కింద 31,250 భరించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1.11లక్షలు గొర్రెల కొనుగోలుకు, మిగతా మొత్తాన్ని బీమా, రవాణా, మందుల కొనుగోలు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. గొర్రెలు యూనిట్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ చేయూతతో గొల్లకురుమల జీవితాల్లో కొత్త వెలుగులు నిండటంతో సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వారు చెబుతున్నారు.
ఈ పథకంతో యూనిట్ను పొందిన వారికి ఎంతో లాభం చేకూరుతుంది. వీటి పెంపకంతో ఏడాదికి ఒక్కో పెంపకందారుడికి పెద్దమొత్తంలో ఆదాయం వస్తుంది. ఉన్న గొర్రెలు ఉండగానే పుట్టిన ప్రతీ గొర్రె నుంచి అదనపు ఆదాయం ఉంటుంది. అంతే కాకుండా వ్యవసాయంతోపాటు అనుబంధంగా వీటిని పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ర్టంలో మాంసం అవసరాలకు సరిపడా గొర్రెలు లేకపోవడంతో దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపకందారుల్లో ఎక్కువ మంది 2, 3 గొర్రెలను పెంచుతుండటంతో వారికి కలిసి రావడంలేదు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 2వ విడుతలో 15,884 ఇవ్వాల్సి ఉండగా, 1782 యూనిట్లు ఇవ్వడం జరిగింది. త్వరలో వీరందరికీ అందించనున్నారు.