ఎన్నారైల సేవలు మరువలేనివి
50 దేశాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చెప్పి గెలుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. శనివారం యాభై దేశాల్లోని టీఆర్ఎస్ ఎన్నారై సంఘాల ప్రతినిధులతో ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. తెరాస బలం కార్యకర్తలేనని, ఎన్నారైల సేవలు మరువలేనివని కొనియాడారు. బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలను పటాపంచలు చేయాలని పిలుపిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పూర్తి ఆధారాలతో బీజేపీ అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొడుతున్నారని.. ఎన్నారైలు బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఏప్రిల్ 27న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి అవకాశం ఉంటే ఎన్నారై ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
మృతిచెందిన కార్యకర్తలకు నివాళులు
ఇటీవల విదేశాల్లో చనిపోయిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలకు వీడియో కాన్ఫరెన్స్లో ముందుగా నివాళులు అర్పించారు. వచ్చే నెల 27న తెరాస ఆవిర్భావ దినోత్సవం ఉన్నదని, అందరూ మెంబర్షిప్డ్రైవ్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవిని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితక్క సూచనల మేరకు ఏప్రిల్ 27 ప్లీనరీలో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయా దేశాల నుంచి టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు అనిల్ కూర్మాచలం, కాసర్ల నాగేందర్, విజయ్కుమార్రెడ్డి కోసన, జగన్ వొడ్నాల, శ్యాంబాబు ఆకుల, జువ్వాడి శ్రీనివాస్, అశోక్ దూసరి, నాగరాజు గుర్రాల, మహిపాల్రెడ్డి, సతీశ్ రాధారపు, కోమాండ్ల కృష్ణ, శ్రీధర్ అబ్బగోని, టోనీ జున్ను, అరవింద్ గుంత శ్రీధర్, చిట్టిబాబు, వెంగల్ జలగం, రాజేశ్ మాదిరెడ్డి, నవీన్, అభిలాష, సుధీర్ జలగం, అహ్మద్ షేక్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.