చెన్నై : తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ తమ ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్లో రజనీకాంత్ ఓటేశారు.
కమల్ హాసన్ చెన్నై హైస్కూల్లో ఓటేశారు. ఆయన వెంట కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు. కమల్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రజనీకాంత్ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇక ఇటీవలే కేంద్రం రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ ఓటేసేందుకు చెన్నై హైస్కూల్కు వచ్చారు. కమల్ హాసన్తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ వచ్చారు. కమల్ కుటుంబం మిగతా ఓటర్ల మాదిరిగానే క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.