పట్నా: బీహార్ మంత్రి ముఖేశ్ సాహ్నీ ఓ ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా తన సోదరుడిని పంపడం ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముఖేశ్ సాహ్నీతో వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశాయి. అంతేగాక మంత్రి ముఖేశ్ సాహ్నీ సోదరుడిని అరెస్ట్ చేయించాలని, ఆ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడ్డారు.
దాంతో సీఎం నితీశ్కుమార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారు. మంత్రి ముఖేశ్ సాహ్నీ ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా తన సోదరుడిని పంపించాడనే విషయం తెలియదని, అదే గనుక నిజమైతే షాకింగ్ అంశమని, అలాంటి ఘటనలు జరుగకూడదని, ఆ అంశాన్ని తాను పరిశీలిస్తానని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. తాజాగా అదే అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం నితీశ్ అది అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకాదని, తెలియక చేశాడని చెప్పారు.
కొన్నిసార్లు ఒక వ్యక్తికి అన్ని విషయాల గురించి అవగాహన ఉండదు. ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా సోదరుడిని పంపడం తప్పు అని అతనికి వివరించాం. దాంతో అతడు తన తప్పును తెలుసుకుని ఒప్పుకున్నాడు. అతడు ఆ పని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అది తెలియక జరిగిన తప్పదం అని నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, శుక్రవారం బీహార్లోని వైశాలి జిల్లా హాజీపూర్లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆ రాష్ట్ర మంత్రి ముఖేశ్ సాహ్నీ తనకు బదులుగా తన సోదరుడిని పంపించాడు.