నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా ఐదోరోజైన సోమవారం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు.
బాన్సువాడ మండలం కొయ్యగుట్ట, హన్మాజీపేట్, తాడ్కోల్, దేశాయిపేట్, ఇబ్రహీంపేట్, రాంపూర్తండా, పులికుచ్చ తండా, పులిగుండు తండా, కోనాపూర్, సంగోజీపేట్, సోమేశ్వర్ తదితర గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేయడం, రోడ్లకు ఇరువైపులా మొలిచిన పిచ్చిమొక్కల తొలగింపు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం, పారిశుద్ధ్య పనులు, గడ్డి మందు పిచికారీ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వెల్గనూర్, మంగ్లూర్, నిజాంసాగర్, నర్సింగ్రావ్పల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావు, ఎంపీడీవో పర్బన్న, ఎంపీవో అబ్బాగౌడ్ పరిశీలించారు.
పిట్లం మండలం అన్నారం గ్రామంలో వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి రోడ్లను శుభ్రం చేయించారు. కిష్టాపూర్ గ్రామంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ వైకుంఠధామంలో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించారు. కార్యక్రమంలో అన్నారం సర్పంచ్ కాశీరాం, కిష్టాపూర్ సర్పంచ్ యశోద, అంగన్వాడీ టీచర్లు, వార్డుసభ్యులు, ఆశవర్కర్లు, పాల్గొన్నారు.బిచ్కుంద మండలకేంద్రంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను పంచాయతీ ప్రత్యేకాధికారి అధికారి పోచయ్య, పంచాయతీ కార్యదర్శి రమేశ్ కూల్చివేయించారు. గ్రామంలో రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మొరం వేయించి చదును చేయించారు. బిచ్కుంద మండలం వాజిద్నగర్లో విరిగిన స్తంభాలను ఎండీవో ఆనంద్ గుర్తించారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఎండీవో వెంట సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ ఉన్నారు. చిన్న దడ్గి పల్లెప్రకృతివనాన్ని జడ్పీసీఈవో సాయాగౌడ్ పరిశీలించారు. పల్లె ప్రకృతివనంలో పిచ్చిమొక్కలను తొలగించాలని సర్పంచ్ అనితావిఠల్రెడ్డితో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీవో మహబూబ్ ఉన్నారు.
బీబీపేట్ మండలకేంద్రంతోపాటు యాడారం, మాందాపూర్, మల్కాపూర్, తుజాల్పూర్, ఇస్సానగర్, ఉప్పర్పల్లి తదితర గ్రామాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు, సిబ్బంది సరిచేశారు. వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాల ని, అవసరమైన చోట ఎల్ఈడీ లైట్లను బిగించాలని, ఇండ్లపై నుంచి వెళ్లిన పాసింగ్ లైన్లను తొలగించాలని గ్రామస్తులు తీర్మానం చేసి విద్యుత్ అధికారులకు అందజేశారు.కామారెడ్డి మండలంలోని రాఘవపూర్లో మొక్కలకు ఏర్పాటు చేసిన కంచెలను అధికారులు పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇప్పటివరకు నెలకొన్న విద్యుత్ సమస్యలను మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్పంచ్ సాగర్గౌడ్, ఎంపీడీవో నాగేశ్వర్రావు, ఏపీఎం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుమేధ ఉన్నారు.
మాచారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో సర్పంచ్ నీలాబాయి ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుశాంత్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ అజీజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోహన్ పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. మరికొన్ని గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలను సిద్ధం చేయిస్తున్నారు. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, పోల్కంపేట గ్రామాల్లో పల్లెప్రగతి పనులను మండల పంచాయతీ అధికారి ప్రభాకర్చారి పరిశీలించారు. సజ్జన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ పుట్టి పోశయ్య మొక్కలు నాటారు.
బీర్కూర్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ మారుపెద్ది రాజు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు.సదాశివనగర్ మండలంలోని మల్లుపేట్ గ్రామంలో ప్రత్యేకాధికారి నామాల లక్ష్మీనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి కుమ్మరి విఠల్ గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. మొక్కలు నాటి కంచెలను ఏర్పాటుచేశారు. సదాశివనగర్ మండలకేంద్రంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ, వైద్య, జీపీ, ఐకేపీ సిబ్బంది రోడ్లను శుభ్రం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో సర్పంచ్ పైడి జానకి జనార్దన్, కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో పాఠశాలలో మొక్కలను నాటడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో సీసీ అబ్బ లింగం తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్, చందాపూర్, బ్రాహ్మణపల్లి, కాళోజివాడి, సంగోజివాడి గ్రామాల్లో చెత్తను తొలగించే పనులు జోరుగా సాగాయి. బ్రాహ్మణపల్లి, చందాపూర్ గ్రామాల్లో చేపడుతున్న పనులను మండల ప్రత్యేకాధికారిణి వసంత పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో హప్సిబా, ఏపీఎం రాజేందర్, సర్పంచులు లావణ్య, సరోజన, ఇందిర, రాజమణి పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని 20, 25వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో మొక్కలు నాటడంతోపాటు వార్డుసభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం పలువార్డుల్లో మురికి కాలువలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్, 25వ వార్డు కౌన్సిలర్ అంజల్రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ తయ్యాబ్ సుల్తానా ఉన్నారు.
బాన్సువాడ పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. 19వ వార్డులో విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ డీఈ కామేశ్వర్, ఏఈ నాందేవ్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, వెంకటేశ్, రమాదేవి, పాశం రవీందర్ రెడ్డి, కిరణ్, మోతీరాం, హకీం పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ కమిషనర్ జీవన్ పరిశీలించారు. పట్టణంలోని రెండో వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.