వరంగల్ : ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీని ఆరగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండాకు చెందిన ప్రసాద్(23) ఆదివారం నర్సంపేట పట్టణానికి వచ్చాడు. అక్కడున్న ఓ రెస్టారెంట్కు వెళ్లిన ప్రసాద్.. చికెన్ బిర్యానీ తిన్నాడు. అనంతరం రెస్టారెంట్ నుంచి బయటకు రాగానే అతను వాంతులు చేసుకున్నాడు. బ్లడ్ కూడా నోట్లో నుంచి రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే ప్రసాద్ స్పృహ కోల్పోయాడు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ప్రసాద్ను తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మున్సిపల్ అధికారులు బిర్యానీ సెంటర్కు వెళ్లి, ఫుడ్ శాంపిల్స్ను సేకరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ప్రసాద్ మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.