తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.