మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బాలల సహాయ వాణి వాహనం ప్రారంభం
నిర్మల్ అర్బన్, మే 18 : కరోనా సోకి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం బాలల సహాయ వాణి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్తో కన్నవారిని కోల్పోయిన పిల్లలను చేరదీసి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాల్సెంటర్కు ఫోన్ వచ్చిన 24 గంటల్లోనే అనాథ పిల్లలను ఈ వాహనంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. బాలికలను కేజీబీవీ పాఠశాలలకు, బాలురను భైంసాలోని వివేకానంద స్కూల్లో చేర్పించి విద్యనందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి స్రవంతి, నాయకులు లోలం శ్యాంసుందర్, రాంకిషన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
సారంగాపూర్, మే 18 : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడెల్లి తండాలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి హాజయ్యారు. ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో 500 పాత, కొత్త దేవాలయాలను నిర్మించి సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రూ. 10 కోట్లతో అడెల్లి ఆలయాన్ని, రాతిశిలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, మంత్రి సోదరుడు మురళీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, ఆలయకమిటీ చైర్మన్ చందు, ఎంపీటీసీ భోజారెడ్డి, నాయకులు రాజేశ్వర్, నాగయ్య, నర్సారెడ్డి తదితరులున్నారు.