యాదాద్రి, జూలై29: ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటూ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, మధ్యవర్తి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన డాక్టర్ సత్యం మడే 2008లో ఆలేరు మండలంలోని కొలనుపాకలో స్విస్లైప్ గ్రీన్ ఎవెన్యూ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ ఏర్పాటుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 22న 5 ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా సబ్ రిజిస్ట్రార్ రూ.50 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వపోవడంతో 2 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, 3 డాక్యూమెంట్లను పక్కన పెట్టాడు. దీంతో చేసేదిలేక బాధితుడు రూ.20వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం మధ్యవర్తి అయిన అసిస్టెంట్ డాక్యుమెంట్ ప్రభాకర్కు రూ.20 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభాకర్తోపాటు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ను అదుపులోకి తీసుకున్నారు.