పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
కోటపాడు, ఎన్వీ బంజరలో వైకుంఠధామాల ప్రారంభం
రఘునాథపాలెం, జూన్ 22: పల్లెలు పచ్చదనంతో వెల్లివిరియాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వీధుల్లో చెత్తా చెదారం, డ్రైనేజీల్లో మురుగు పేరుకపోయి ఉండడానికి వీల్లేదన్నారు. రఘునాథపాలెం మండలం కోటపాడు, ఎన్వీ బంజర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డులను మంత్రి అజయ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను దీటుగా పట్టణాలకు అభివృద్ధి చేసేందుకు అధిక మొత్తంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్పంచ్లు, అధికారులు సమన్వయంతో పని చేసి పల్లెల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కోటపాడు గ్రామంలో ప్రారంభించిన పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులను చూసి సర్పంచ్, ఉప సర్పంచ్లను మెచ్చుకున్నారు. పల్లెప్రకృతి వనంలోని రచ్చబండపై కొద్దిసేపు కూర్చొని గ్రామస్తులతో ముచ్చటించారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పీటీసీ ప్రియాంక, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, సర్పంచ్ బాతుల రమణ, ఉప సర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దొంతు సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా, కోటపాడు మాజీ సర్పంచ్ నెల్లూరి చంద్రయ్య, గ్రామ పెద్దలు కొంటెముక్కల నాగేశ్వరరావు, షేక్ ఆరీఫ్, భిక్షమయ్య, బాతుల సుధాకర్, మండల నాయకులు మాధంశెట్టి హరిప్రసాద్, గొర్రె శ్రీనివాసరావు, నున్నా శ్రీనివాసరావు, చెరుకూరి పూర్ణ పాల్గొన్నారు.