వ్యాక్సినేషన్కు భారీ స్పందన
45 ఏండ్లు పైబడిన 3.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ షురూ
24 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న ప్రక్రియ
త్వరలో మరో 21 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు
ఇప్పటి వరకు జిల్లాలో 36,756 మందికి టీకాలు
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచన
సంగారెడ్డి ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. మొదటి విడుతలో వైద్యఆరోగ్యశాఖ, ఫ్రంట్లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి టీకా వేయగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏండ్లు దాటిన వారికి కూడా టీకా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 39 పీహెచ్సీల్లో 18చోట్ల, ఆరు వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తుండగా, ఈ నెల 15వరకు మిగతా 21 పీహెచ్సీల్లో కూడా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 36,756 మందికి టీకా వేయగా, ఇందులో మొదటి డోస్ 28,794 మంది, రెండో డోస్ను 7,962 మంది తీసుకున్నారు. వైరస్ను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించడంలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
కరోనా తీవ్రత పెరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలను వేగవంతం చేస్తోంది. ఓవైపు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే మరోవైపు కరోనా టీకాల పంపిణీని మరింత వేగంగా జరిగేలా చర్యలు చేపడుతున్నది. దీంతో జిల్లాలో మలిదశ కరోనా టీకా పంపిణీ చురుగ్గా సాగుతోంది. 45 ఏండ్లు పైబడిన వారు ఉచిత టీకాలను వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం 45 ఏండ్లు పైబడిన వారికి సైతం ఉచితంగా కరోనా టీకాను వేస్తోంది. కొద్ది రోజులుగా జిల్లా లో కరోనా టీకా వేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కరోనా టీకా పంపిణీ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం సంగారెడ్డిలో 24 ప్రభుత్వ దవాఖానలు, 7 ప్రైవేటు దవాఖానలు, జిల్లాలోని ఆరు వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో, 39 పీహెచ్సీలకుగాను 18 పీహెచ్సీల్లో కరోనా టీకా వేస్తున్నారు. ఈ నెల 15 వ తేదీ వరకు దశల వారీగా జిల్లాలోని మిగితా 21 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా కరోనా టీకా పంపిణీ ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 21 పీహెచ్సీల్లో కరోనా టీకా పంపిణీకి వీలుగా ఫ్రీజర్లు, కరోనా వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో కేంద్రం లో వంద మందికి కరోనా టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మలిదశ టీకా పంపిణీ ద్వారా జిల్లాలో కరోనా కట్టడి అయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
36,756 మందికి టీకా పంపిణీ
సంగారెడ్డి జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కరోనా టీకా పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నది. జిల్లాలో ప్రస్తుతం 24 ప్రభుత్వ దవాఖానలు, 7 ప్రైవేటు దవాఖానల ద్వారా కరోనా టీకాను వేస్తున్నారు. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, కరోనా ఫ్రంట్లైన్ వారియర్లకు, 60 ఏండ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ను వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచిత కరోనా టీకాను వేస్తున్నారు. కరోనా టీకా వేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ముందస్తుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లేదా నేరుగా పీహెచ్సీ, వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో టీకా తీసుకోవచ్చు. ప్రైవేటు దవాఖానల్లో నిర్ణీత రుసుము చెల్లించి టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో 36756 మందికి కరోనా టీకా వేసుకున్నారు. ఇందులో మొదటి డోస్ కరోనా టీకాను 28794 మంది వేసుకోగా రెండో డోస్ను 7962 మంది వేసుకున్నారు. జిల్లాలోని వైద్యసిబ్బంది 6515 మంది మొదటి, 4836 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాగే కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లు 6860 మంది మొదటి డోస్, 3041 రెండో డోస్ టీకా వేయించుకున్నారు. 60 ఏండ్లు పైబడిన 8923 మంది మొదటిడోస్, 40 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. 45 ఏండ్లు పైబడిన వారు 6496 మంది మొదటి డోస్ టీకా వేసుకోగా 45 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు. జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 3.50 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో 45 ఏండ్లు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఈనెల 15 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో కరోనా టీకా పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అప్రమత్తతోనే కరోనా దూరం
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారు తప్పనిసరి గా మాస్కు ధరలించాలని సూచిస్తున్నది. మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానాలు విధించటంతోపాటు కేసు నమోదు చేస్తున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలు విధిగా మాస్కు ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది.